పద్మవ్యూహంలో జగన్ సర్కార్-అప్పులకు మరో కార్పోరేషన్-ఆర్ధిక ఎమర్జెన్సీ దిశగా ?
ఏపీ ప్రభుత్వం నానాటికీ ఆర్ధిక పద్మవ్యూహంలో చిక్కుకుపోతోంది. ఇప్పటికే కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు చేయడంతో పాటు రహస్య మార్గాల్లోనూ రుణాలు సేకరించినా ఫలితం లేకుండా పోతోంది. అటు ఆర్బీఐ వద్ద బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందామన్నా ఇచ్చిన సొమ్ము కాస్తా పాత బకాయిలకు జమ చేసేసుకుంటోంది. దీంతో ఆర్బీఐ వద్దకు వెళ్లాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి. దీంతో అస్తవ్యస్తంగా మారిన ఆర్దిక వ్యవస్ధను గాడినపెట్టే బదులు మళ్లీ కొత్త అప్పుల కోసం దారులు వెతుకుతున్న జగన్ సర్కార్.. ఇందుకోసం మరో కార్పోరేషన్ ఏర్పాటుకు అడుగులేస్తోంది.
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ అప్పులు వైసీపీ ప్రభుత్వ హయాంలో మరిన్ని లక్షల కోట్లకు పెరిగిపోయాయి. కేంద్రం విధిస్తున్న ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఎప్పటికప్పుడు దాటేస్తూ అప్పులు తీసుకొస్తూ ప్రభుత్వ పాలన సాగిస్తున్న వైసీపీ సర్కార్ .. సంక్షేమ పథకాల కోసం పెడుతున్న మొత్తాలతో పూర్తిగా అప్పుల కుప్పగా మారిపోయింది. అలాగని భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపే పరిస్ధితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేటలో బిజీగా మారిపోతోంది. ఢిల్లీలో అయితే వైసీపీ ఎంపీలతో పాటు ఆర్ధికమంత్రి బుగ్గన అప్పుల కోసం చేయని ప్రయత్నం లేదు. అయినా కొత్తగా అప్పు పుట్టే పరిస్ధితులు కనిపించడం లేదు.
పద్మవ్యూహంలో జగన్ సర్కార్
తాము అధికారం చేపట్టే నాటికి రెండున్నర లక్షల కోట్ల అప్పులుంటేనే దీనిపై శ్వేతపత్రం ప్రకటించి పాలన మొదలుపెట్టిన వైసీపీ సర్కార్ ఈ రెండేళ్లలో మరోసారి అలాంటి శ్వేతపత్రం ప్రకటించేందుకు సాహసించని పరిస్ధితి. ఎందుకంటే భారీ ఎత్తున చేస్తున్న అప్పులు ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నాయి. ఖాళీ ఖజానాతో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి దాపురించింది. వేస్ అండ్ మీన్స్ కు వెళ్తున్నా, ఓడీలకు వెళ్తున్నా ఆ మొత్తాలు తాత్కాలిక సర్దుబాట్లకు కూడా సరిపోని పరిస్దితి. అలాగని కేంద్రం నుంచి అప్పులు తీసుకునే పరిస్ధితీ లేదు. బహిరంగ మార్గెట్లో రుణాలు తీసుకునేందుకు నిబంధనలు అడ్డంకిగా మారిపోతున్నాయి. దీంతో జగన్ సర్కార్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతోంది.
కనికరం చూపని కేంద్రం
ఏపీలో వైసీపీ సర్కార్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు నటిస్తున్న కేంద్రం.. తన రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోంది. సీఎం జగన్ కోరినట్లుగా ఆర్ధిక సాయం చేసే విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలు సైతం విడుదల చేయడం లేదు. విభజనతో నష్టపోయిన ఏపీకి రెవెన్యూ లోటు పూడించేందుకు ఇస్తామన్న మొత్తం కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. కొత్తగా రుణాలు తీసుకునేందుకు సైతం అనుమతులు నిరాకరిస్తోంది. ఢిల్లీలో వైసీపీ ఎంపీలతో పాటు ఆర్ధిక మంత్రి బుగ్గన లాబీయింగ్ చేస్తున్నా కనికరించని పరిస్దితి. నిబంధనల సాకుతో కొత్త రుణాలకు కానీ, రుణాల పరిమితి పెంచేందుకు కానీ కేంద్రం మొగ్గు చూపడం లేదు. దీంతో వైసీపీకి ఎన్నడూ లేనంత కష్టకాలం దాపురిస్తోంది.
ఇక రహస్య అప్పులే గతి
ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తీసుకోవాల్సిన అప్పును మొదటి నెలలోనే తీసేసుకుంది. అదే సమయంలో కార్పోరేషన్ల ద్వారా తెస్తున్న రుణాల పరిమితి కూడా దాటిపోయింది. దీంతో రహస్య పద్ధతుల్లో అప్పులు తెచ్చేందుకు సైతం ప్రభుత్వం సిద్దపడుతోంది. ఏపీఎస్డీసీ ద్వారా సేకరించిన రూ.25 వేల కోట్ల అప్పు రహస్య రుణమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని వివరాలు కానీ, షరతులు కానీ ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. చివరికి ఈ వివరాలు లీక్ చేసిన ఆర్ధికశాఖ ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ చేయించి మరీ వేటు వేయాల్సి వచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ రహస్య అఫ్పుల వ్యవహారం కూడా ఇప్పుడు జాతీయ స్దాయిలో చర్చకు వస్తోంది.
మరో అప్పుల కార్పోరేషన్ ?
ఇప్పటికే ప్రభుత్వం తమకు అందుబాటులో ఉన్న కార్పోరేషన్ల ద్వారా భారీ ఎత్తున ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో రుణాలు సేకరించింది. ఆ తర్వాత అప్పుల కోసం ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా తాజాగా రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకుని అభాసుపాలైంది. ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ పేరుతో మరో సంస్ధ ఉండనే ఉంది. దాని ద్వారా కూడా రుణాల సేకరణకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుల కోసం మరో కొత్త కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవాళ కేబినెట్లో ఈ కొత్త కార్పోరేషన్ ఏర్పాటును ప్రకటించే అవకాశముంది. నిధుల సేకరణ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్పోరేషన్ ద్వారా మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే అప్పుల పరిమితులు దాటిపోయి, తనఖా పెట్టడానికి కూడా ఆస్తులు, ఆదాయాలు లేని పరిస్దితుల్లో ఈ కొత్త కార్పోరేషన్ ఏ మేరకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందో చూడాలి.
Recommended Video
ఆర్ధిక ఎమర్జెన్సీ దిశగా ఏపీ ?
ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టేందుకే వచ్చే రాబడి అంతా సరిపోతోంది. దీంతో కొత్తగా అప్పులు చేయలేక, అలాగని సొంత రాబడి పెంచుకోలేక, మరోవైపు పన్నులు పెంచలేక ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరికొన్ని రోజులు కొత్తగా అప్పులు పుట్టకపోతే ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ఏపీలో ఆర్ధిక అత్యవసర స్ధితి విధించే అవకాశాలూ లేకపోలేదు. ఆర్టికల్ 360 ప్రకారం కేంద్రం రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో ఏపీలో అత్యవసర పరిస్ధితి విధించి ఆర్ధిక వ్యవహారాల్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. వైసీపీ సర్కార్ ఇప్పుడే మేల్కొంటుందా లేక అంతవరకూ తెచ్చుకుంటుందా అనేది కాలమే చెప్పాలి.