లక్షకోట్లు..13 చార్జిషీట్లు..16 నెలల జైలు: జగన్ ఇంకేమి సాధించారు, యనమల ప్రశ్న
వైసీపీ అధినేత జగన్ తీసుకొస్తున్న నవరత్నాలనే ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్న వైసీపీ ఆరోపణలపై మంత్రి యనమల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ నేరాలను కాపీకొట్టడం ఎవరి తరం కాదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని ధ్వజమెత్తారు.
జగన్ పథకాలను కాపీకొట్టాల్సిన ఖర్మ తమకు లేదని చెప్పిన యనమల రామకృష్ణ... ప్రజలకు ఏ మంచి పనిచేసినా వ్యతిరేకించడమే పనిగా వైసీపీ పెట్టుకుందని అన్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తే వైసీపీ నిందిస్తోందని కాపుల పట్ల ఆపార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. జగన్ హార్వర్డ్ యూనివర్శిటీలో ఒక అవినీతి సబ్జెక్ట్ అని యనమల అన్నారు. జగన్ రూ. లక్ష కోట్లు 13 ఛార్జి షీట్లు, 16 నెలల జైలు తప్ప ఏమి సాధించారని ప్రశ్నించారు.
జగన్ చేసిన కుంభకోణాలే ఆయన నవరత్నాలు అని యనమల ఫైర్ అయ్యారు. జగన్వి నవరత్నాలు కాదని అవి అష్టావక్రదోపిడీలు అని యనమల ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారని చెప్పారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ.2000కు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని యనమల గుర్తు చేశారు. ఇన్ని మంచి పనులు చేసిన ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు ఎక్కడ ఎన్నుకుంటారో అన్న భయం జగన్కు వైసీపీ నాయకులకు పట్టుకుందని యనమల చెప్పారు.
ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని జగన్ చెప్పగానే ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు ఆగమేఘాలపై పెన్షన్ రెండు వేలు చేశారని ఆరోపించింది వైసీపీ. డ్వాక్రా రుణాలపై కూడా జగన్ స్టాండ్ తీసుకున్న తర్వాతే చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడించారని ... రాబోయే రోజుల్లో జగన్ నవరత్నాలను చంద్రబాబు ప్రభుత్వం కాపీ కొడుతుందని వైసీపీ జోస్యం చెప్పింది.