జగన్ మాజీ సలహాదారుకు వాట్సాప్ బెదిరింపులు-రఘురామ నంబర్తో ? ట్వీట్ కలకలం
ఏపీ రాజకీయాల్లో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చర్చ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన చేస్తున్న పోరాటంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ సర్కారు.. సీఐడీతో రాజద్రోహం కేసులు పెట్టించింది. అయినా వెనక్కి తగ్గకుండా ప్రభుత్వంపై పోరాటం మరింత ముమ్మరం చేసిన రఘురామ.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఫోన్ నంబర్తో సీఎం జగన్ మాజీ సలహాదారుకు వాట్సాప్లో వేధింపులు ఎదురుకావడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని జగన్ మాజీ సలహాదారు పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
మరో వివాదంలో రఘురామ
ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తన దాడిని ముమ్మరం చేస్తూ రోజుకో విధంగా రెచ్చిపోతున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓవైపు సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న రఘురామ తాజాగా జగన్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన మాజీ సలహాదారును, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా పరిణామాలు ఈ వాదనకు ఊతమిచ్చేలా ఉన్నాయి.
జగన్ మాజీ సలహాదారుకు వాట్సాప్ టార్చర్
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎంవోలో సీఎం జగన్ సలహాదారుల్లో ఒకరిగా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ను నియమించారు. దాదాపు ఏడాది పాటు ఆ విధుల్లో కొనసాగిన తర్వాత పీవీ రమేష్ బాధ్యతల్లో కోత పెట్టారు. చివరికి ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన పదవీకాలం ముగియడంతో ఆయన విధుల్లో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వాట్సాప్ నంబర్కు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్లు రావడం కలకలం రేపుతోంది. ఈ మెసేజ్ల్లో ఏముందో నిర్షిష్టంగా తెలియకపోయినా కచ్చితంగా పీవీ రమేష్ను వేధిస్తూ మెసేజ్లు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
రఘురామ వేధింపులపై పీవీ రమేష్ ట్వీట్
రఘురామరాజుదిగా చెప్తున్న 90009 11111 నంబర్ నుంచి తనకూ, కుటుంబ సభ్యులకూ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని, ప్రజా ప్రయోజనార్ధం ఈ విషయాన్ని తాను బయటపెడుతున్నట్లు జగన్ మాజీ సలహాదారు పీవీ రమేష్ ఇవాళ ట్వీట్ చేశారు. దీంతో రఘురామ నంబర్ నుంచి ఆయనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్లు ఏంటి ? అందులో బెదిరింపులున్నాయా, వేధింపులున్నాయా ?అసలు పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఈ విషయాన్ని ట్వీట్ చేయడమేంటన్న చర్చా జరుగుతోంది.
రఘురామ స్పందించాలన్న పీవీ రమేష్
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుదిగా భావిస్తున్న అన్లిస్టెడ్ నంబర్ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని పీవీ రమేష్ తన ట్వీట్లో ఆరోపించారు. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందించాలని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ను ట్యాగ్ చేశారు. దీంతో రఘురామ నుంచి వచ్చే స్పందన ఆధారంగా పీవీ రమేష్ తదుపరి చర్యలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే పీవీ రమేష్ ట్వీట్ వెనుక ఎవరున్నారు ? అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
Recommended Video