జగన్కు బలవంతంగా గ్లూకోజ్: రెండు రోజుల్లో ఇంటికి!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రమంగా కోలుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోరుతూ వారం రోజుల క్రితం జగన్ ఆమరణ దీక్ష ప్రారంభించగా రెండు రోజుల క్రితం పోలీసులు భగ్నం చేసి నిమ్స్కు తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు బలవంతంగా గ్లూకోజ్ ఎక్కించారు.
జగన్ వైద్యానికి నిరాకరిస్తుండటంతో బలవంతంగా చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు గురువారం రాత్రి విలేకరులకు చెప్పారు. జగన్ కొంత బలహీనంగా ఉన్నారని, శరీరంలో కీటోన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, ఒకటి రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామన్నారు.
జగన్ వెంటవెంటనే రెండుసార్లు నిరాహార దీక్ష చేపట్టడంతో తీవ్ర ప్రభావం చూపిందని వైద్యులు చెప్పారు. ఇటీవల చంచల్ గూడ జైలులో జగన్ దీక్ష చేపట్టగా, విడుదలయ్యాకా తాజాగా ఆమరణ దీక్ష చేపట్టారు. జగన్ నెల రోజుల కింద దీక్ష చేసినప్పుడే కీటోన్స్ ఎక్కువగా ఉన్నాయని, తిరిగి నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్స్ విడుదల కావడం శరీరంపై ప్రభావం చూపిందన్నారు.
షుగర్ లెవల్ 113కు పెరిగిందని, సాధారణ స్థాయికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. పండ్ల రసాలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
వైద్య పరీక్షల ఫలితాలు, వైద్యుల నిర్ణయం తర్వాతనే జగన్ను డిశ్చార్జ్ చేస్తారని ఆయన సతీమణి భారతి అన్నారు. శుక్రవారం డిశ్చార్జిపై నిర్ణయం ఉంటుందన్నారు.