జగన్ న్యూజిలాండ్ టూర్: కుటుంబంతో కలిసి పయనం.. గత రాత్రే!
జగన్ రెండువారాల పాటు న్యూజిలాండ్లో గడపనున్నారు. తిరిగి జూన్10న ఆయన స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి కటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరారు. గురువారం రాత్రి 11గం. సమయంలో సింగపూర్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో ఆయన న్యూజిలాండ్ పయనమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయనకు వీడ్కోలు పలికారు.
సీబీఐకి షాక్: కోర్టులో జగన్కు ఊరట, విదేశీ పర్యటనకూ అనుమతి
కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. జగన్ రెండువారాల పాటు న్యూజిలాండ్లో గడపనున్నారు. తిరిగి జూన్10న ఆయన స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఎప్పుడూ బిజీ రాజకీయాలతో తీరిక లేకుండా గడుపుతున్న జగన్.. కొద్దిరోజులు పొలిటికల్ లైఫ్ నుంచి పక్కకు వెళ్లి సేద తీరేందుకే ఈ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, గత నెల ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో ముందుగా ఖరారైన ఆయన విదేశీ పర్యటన పట్ల అనుమానాలు మొదలయ్యాయి.
కానీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు జగన్కు అనుకూలంగా రావడంతో ఆయన విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆ సందర్భంగా.. జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు..మే 15 నుంచి జూన్ 15లోగా ఏవైనా 17రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చునని అనుమతినిచ్చింది.