'ఒక్క ఛాన్స్ ఇవ్వండి': నేడే జగన్ పాదయాత్ర, నేటి షెడ్యూల్ ఇదే..
బహిరంగ సభ తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
Recommended Video

కడప: 2019లో అధికారమే లక్ష్యంగా జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సిద్దమయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్ర సుమారు 3,000కి.మీ సాగనుంది.
సోమవారం ఉదయం 9గం. ఇడుపాలయలో బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో జిల్లా స్థాయి నేతలంతా ఇడుపులపాయకు తరలుతున్నారు. పాదయాత్ర లక్ష్యాలు, ప్రభుత్వ వైఫల్యాల గురించి బహిరంగ సభలో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.

'ఒక్క ఛాన్స్ ఇవ్వండి'
పాదయాత్ర సందర్భంగా ప్రజలంతా జగన్కు అండగా నిలబడాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరనున్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కూడా ఆమె మరోసారి ప్రజలను కోరే అవకాశం ఉంది.కాగా, రోజుకు 15కి.మీ చొప్పున పాదయాత్ర పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం, కడప పెదదర్గాను కూడా జగన్ సందర్శించారు. పాదయాత్రను విజయవంతం చేయాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆయన కోరుకున్నట్టు తెలుస్తోంది.

వైఎస్ సమాధి వద్దకు
పాదయాత్రకు ముందు ఉదయం 8.30గం.కు జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని ఆయన తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. అనంతరం పాదయాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.
వైఎస్ సమాధి నుంచి అక్కడికి కొద్ది దూరంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు 9గం.కు చేరుకుంటారు. పాదయాత్రను, వైసీపీ కార్యకర్తలను, రాష్ట్ర ప్రజలను ఉధ్దేశించి వేదిక పైనుంచి జగన్ ప్రసంగిస్తారు. 9.45వరకు ప్రసంగం కొనసాగుతుంది.

బహిరంగ సభ తర్వాత
బహిరంగ సభ తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నాం 1.00 గంటకు వీరన్నగట్టుపల్లెకు చేరుకుని, అక్కడ భోజనం చేసి 3 గంటల వరకు విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి వేంపల్లె క్రాస్ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపం వరకు పాదయాత్ర చేస్తారు. దీంతో సోమవారం నాటి షెడ్యూల్ ముగుస్తుంది.

సోమవారం 8.9కి.మీ
మొత్తంగా సోమవారం నాడు జగన్ 8.9 కి.మీ నడవనున్నారు. యాత్ర ముగించిన చోటే రాత్రికి బస చేస్తారు. తొలిరోజు పాదయాత్ర సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలంతా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి 30 మంది హాజరవుతారని సమాచారం.












Click it and Unblock the Notifications