జగన్ పాదయాత్ర పాట్లు: మీడియా పెద్దలతో ఇష్టాగోష్ఠి, రాధాకృష్ణకు అందని ఆహ్వానం
వచ్చే ఎన్నికల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు నవంబర్ ఆరో తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టారు ఆంధప్రదేశ్లో విపక్ష నేత వైఎస్ జగన్. దీనిపై మీడియా సంస్థల అధినేతలతో చర్చలు ప్రారంభించారు.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేయ సంకల్పించారు. ఈ నేపథ్యంలో తాను చేపట్టే పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని మీడియా సంస్థల అధినేతలు, సీఈఓలు, ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో ఇష్ఠాగోష్టి చర్చలు ప్రారంభించారు. దీనివెనుక ఆయన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఇటీవలే ఈనాడు అధినేత రామోజీ రావును ఇంటికి వెళ్లి కలిసిన వైఎస్ జగన్ మిగిలిన వారందరినీ తన ఇంటికే ఆహ్వానించారు.
Recommended Video

2004 తర్వాత టీవీ మీడియాలో సంచలనం స్రుష్టించిన టీవీ - 9 సీఈవో రవి ప్రకాశ్ మినహా మిగతా చానళ్ల అధిపతులు, సీఈవోలు బుధవారం రాత్రి జరిగిన ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. టీవీ - 9 సీఈవో రవి ప్రకాశ్కు స్వయంగా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మీరు రాకపోతే, నేనే మీ ఇంటికి వస్తా. అని కూడా జగన్ చనువుగా అన్నట్లు వినికిడి. అయినా రవిప్రకాష్ రాలేదు. అది వేరే సంగతి. ఇక ఆంధ్రజ్యోతి దిన పత్రిక, దాని అనుబంధ ఏబీఎన్ టీవీ చానెల్ అధినేత వేమూరి రాధాకృష్ణకు ఆహ్వానం పంపనే లేదని సమాచారం.
ఇంటి వద్ద మీడియా సంస్థల అధినేతలు, తదితరులతో భేటీ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ అదే రోజు రాత్రి ఓ పాపులర్ ఛానెల్ అధినేతతో సుదీర్ఘ భేటీ వేసినట్లు తెలుస్తోంది. దాదాపు అర్థరాత్రి సమయంలో జగన్ ఆ మీడియా అధినేత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. జగన్తో పాటు గోదావరి జిల్లాలకు చెందిన ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఎంపీ కొంత కాలంగా జగన్కు మద్దతుగా కాకున్నా, చంద్రబాబును విమర్శించడంలో ముందున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మీడియాలో హల్ చల్ చేసేవారు.

పాదయాత్ర కవరేజీ కోసం వైఎస్ జగన్ ఇలా
సదరు చానెల్ అధినేతతో వైఎస్ జగన్, సదరు మాజీ ఎంపీ కలిసి రెండుగంటల పాటు సుదీర్ఘ భేటీ నిర్వహించారని, పాదయాత్రకు మద్దతు కోసమే ఇదంతా అని భోగట్టా. పాదయాత్రకు మీడియా కవరేజ్ బాగా ఉంటే చాలని ప్రజల్లోకి తన మాటలు వెళ్తేచాలని, ఎన్నికల్లో మద్దతు, సిద్దాంతాల విషయంలో తాను మొహమాట పెట్టనని జగన్ మీడియా ప్రతినిధులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇక మీడియా సంస్థల అధినేతల్లో ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో వైఎస్ జగన్ కు సత్సంబంధాలే ఉన్నాయి. ప్రింట్ మీడియాలో ఈనాడు మొదటి స్థానంలో నిలిస్తే.. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ - 9 తొలి వరుసలో ఉంటుంది. తన పాదయాత్రకు మీడియా కవరేజీ కోసం ఈనాడు అధినేత రామోజీరావు ఇంటికెళ్లి చర్చించిన వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ హయాంలో ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి బద్ధ శత్రువులుగా వ్యవహరించాయని విమర్శలు ఉన్నాయి.

జ్యోతితో దూరమెందుకు?
కానీ వైఎస్ జగన్ ప్రస్తుతం తన రాజకీయ వ్యూహంలో భాగంగా ‘ఈనాడు' అధినేతను కలిసిన తర్వాత ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాక్రుష్ణను చర్చలకు ఆహ్వానించకపోవడం ఆసక్తి కర పరిణామం. వైఎస్ జగన్కు ఆంధ్రజ్యోతి ఎంత వ్యతిరేకమో, ఈనాడు కూడా అంతే కదా? గడచిన పదేళ్లుగా ఈనాడు జగన్కు, వైఎస్కు వ్యతిరేకంగా ఎన్ని వేల వార్తలు వండి వార్చిందో తెలియనిదా? అలాంటి ఈనాడుతోనే రాజీ పడినపుడు, ఇప్పటికి రెండు మూడు సార్లు రామోజీ దగ్గరకు వెళ్లి కలిసినపుడు, రాధాకృష్ణతో సమస్య ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒకవెళ్లి కలిసినా రాధాకృష్ణ మారరు, ఆయన టీడీపీ అనుకూల వైఖరి అలాగే వుంటుందని జగన్ నిర్థారణకు వచ్చారా? ఆ లెక్కన జగన్ రెండు మూడు సార్లు కలిసినంత మాత్రాన రామోజీ, ఈనాడు పాలసీలో అద్భుతమైన మార్పులను జగన్ ఊహిస్తున్నారా? ఎన్నికల వేళ తెలుస్తుంది జగన్కు అసలు విషయం తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మర్యాదలు పాటించరా?
పాదయాత్ర సమయంలో కాస్త కవరేజీ పెరిగితే చాలన్న ధోరణిలో వైఎస్ జగన్ ఉన్నారు. ఎన్నికల వ్యూహం సంగతెలా ఉన్నా.. పాదయాత్ర సమయంలో కలిస్తే, సంప్రదిస్తే తప్పేమి కాకపోగా మర్యాద పూర్వకంగానూ ఉంటుందన్న సంగతి గుర్తుంటుంది. వైఎస్ జగన్ ఒక ప్రతిపక్ష నేత మాత్రమే కాదు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కూడా. ఆయన చేపట్టే పాదయాత్రకు ఆంధ్రజ్యోతిలో కొంతైనా కవరేజీ ఉంటుందని చెప్తున్నారు. కానీ రాధాక్రుష్ణను వైఎస్ జగన్ ఆయనను దూరం పెట్టడంలో ఔచిత్యం ఏమిటని సందేహిస్తున్నారు.












Click it and Unblock the Notifications