జమ్మలమడుగులో వైయస్ భారతి ప్రచారం: చంద్రబాబును ప్రజలు ఛీదరించుకుంటున్నారు
జమ్మలమడుగు: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ ప్రచార జోరును పెంచింది. ఇప్పటికే జగన్ తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలలు ప్రచారం నిర్వహిస్తుండగా తాజాగా వైయస్ జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతి రెడ్డి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిలకు మద్దతుగా ప్రచారం చేశారు. వైసీపీని అధికారంలోకి తీసుకువస్తే జగన్ చేసే అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె అక్కడి ప్రజలకు వివరించారు.
జమ్మలమడుగులో ప్రచారం నిర్వహించిన భారతీ రెడ్డికి మహిళలు ఘనస్వాగతం పలికారు. హారతులతో స్వాగతం పలికారు. ఇక జగన్ అధికారంలోకి వస్తే తండ్రి వైయస్ కంటే మంచి పాలన అందిస్తారని భారతి చెప్పారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం ఒక్క జగన్తోనే సాధ్యమన్నారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ఈ సందర్భంగా భారతి రెడ్డి వివరించారు. చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పిన భారతి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని వెల్లడించారు. జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. ఇక వైయస్ వివేకానంద హత్యకు ముందు రోజు జమ్మలమడుగులోనే ప్రచారం నిర్వహించిన సందర్భాన్ని ఆమె గుర్తుకు చేసుకున్నారు.

టీడీపీ వాళ్లు కత్తులతో ప్రాణాలు తీస్తే తాను కత్తులను ఉపయోగించి ప్రాణాలు పోశానని జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే స్టీల్ ఫ్యాక్టరీకి తిరిగి కొబ్బరికాయ కొడుతారని సుధీర్ రెడ్డి చెప్పారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వారు ఫ్యాక్షన్తో పాటు కమీషన్లను నమ్ముకున్నారని ప్రజలు ఫ్యాక్షన్ నేతలను కోరుకోవడం లేదని సుధీర్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబు రూ.2 కోట్లతో ఒక శిలాఫలకం వేసి వెళ్లారని అంతకుమించి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో కనిపించలేదని విమర్శించారు. జమ్మలమడుగులో ఫ్యాక్షన్ ముద్ర తొలగిపోవాలంటే ఇక్కడ అభివృద్ధి, ఉపాధి జరగాలని నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో భావించి బ్రహ్మణీ స్టీల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారని సుధీర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications