జగన్ అలా అన్నారా?: ఎమ్మెల్యేలను వద్దంటే వద్దన్నారట..
ఒంగోలు: ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రత్యక్ష ఆరోపణలు, విమర్శల కన్నా పరోక్షంగా జరిగే రాజకీయాలే ఎక్కువ. వారి వారి అనుకూల మీడియాల ద్వారా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఏపీ ప్రజలకు తెలిసిందే.
తాజాగా వైసీపీ అధినేత జగన్పై ఆయన ప్రత్యర్థి మీడియా ఒక కథనాన్ని సంధించింది. పైకి బాగానే ఉన్నప్పటికీ.. జగన్ తీరు వల్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసుగుచెందుతున్నారట. అసహనంతో ఉడికిపోతూ ఇటీవలే ఓ టీడీపీ ఎమ్మెల్యే వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారట. ఇందులో నిజానిజాలెంతో తెలియదు కానీ ఇప్పుడీ కథనంపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఏంటా కథనం:
తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా.. వారికి మంత్రిపదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు వైసీపీ అప్పట్లో ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అయితే హోదాపై ఇంటా, బయట తీవ్రంగా చర్చ జరుగుతున్న తరుణంలో.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే బాగుంటుందని వైసీపీ ఎమ్మెల్యేలు భావించారట. సభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వదులుకోవద్దు అనుకున్నారట.
Recommended Video
జగన్ అలా అన్నారా?:
ప్రకాశంజిల్లా పాదయాత్రలో ఉన్న తమ పార్టీ అధినేత జగన్ను కలిసి ఇదే విషయం ఆయన చెవిన వేశారట. అయితే జగన్ మాత్రం మాటంటే మాటేనని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లవద్దని తెగేసి చెప్పారట. వైసీపీ నేతలు ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదట.
తాను లేకుండానా?:
అప్పటికీ.. 'మీరు పాదయాత్రలో ఉండండి.. మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం' అని జగన్ కు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పి చూశారట. అయితే తాను లేకుండా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారట జగన్. అందుకే గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టబడి ఉండాలని ఆదేశించారట.
'మావాడు రానిచ్చేటట్టు లేడు':
ఇదే విషయాన్ని ఇటీవల టీడీపీ నేతలతోనూ వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారట. 'మావాడు రానిచ్చేటట్టు లేడు' అంటూ వాపోయారట. పాదయాత్ర కంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడితేనే ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చూశామని, కానీ జగన్ మాత్రం వినలేదని వాపోయారట.