కూతురు కోసం లండన్కు జగన్: బాధ్యతలు సాయికి, నేతల్లో ఆందోళన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన అనంతరం వెంటనే మరో పర్యటనకు వెళ్లనున్నారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు నెలల కారంలోనే వరుసగా రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.
కూతురుకు లండన్ విద్యాసంస్థలో సీటు: జగన్ లండన్ టూర్కు ఓకే, వరుస షాక్ల తర్వాత రిలీఫ్
తన పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేర్పించేందుకు జగన్ 11వ తేదీన లండన్ వెళుతున్నారు. తన గైర్హాజరీలో పార్టీ కార్యక్రమాలన్నీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి నిర్వహిస్తారని సీనియర్ నేతలకు జగన్ చెప్పారు.
మూడు నెలల్లో రెండోసారి జగన్
మూడు నెలల వ్యవధిలో జగన్ తన కుటుంబంతో రెండోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మూడు నెలల క్రితం కుటుంబంతో సహా విహారయాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్లారు.
విజయసాయి రెడ్డికి బాధ్యతలు
తాను లేకపోయినా బాధ్యతలను విజయ సాయి రెడ్డికి అప్పగించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు పార్టీ నేతల వలసల ప్రచారం, మరోవైపు వైయస్సార్ కుటుంబం పేరుతో చేపట్టిన కార్యక్రమం ప్రారంభదశలోనే ఉంది. ఈ దశలో జగన్ విదేశీ పర్యటన ఆ పార్టీ నేతలను కొంచెం గందరగోళానికి గురి చేస్తోందని అంటున్నారు.
త్వరలో పాదయాత్ర
అక్టోబర్ నుంచి ప్రారంభించాలనుకుంటున్న పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ను ఖారారు చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే విజయ సాయి రెడ్డి కొంత కసరత్తు చేశారు. పాదయాత్రలో దాదాపు వంద నియోజకవర్గాల్ని కవర్ చేయాలనుకుంటున్నారు.
వరుస పార్టీ కార్యక్రమాలతో హడావుడి
పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాల్లో చేయాల్సిన ఏర్పాట్ల పైన ఇప్పటికే ఆయా స్థానిక నేతలకు సమాచారం అందించారని అంటున్నారు. మొత్తానికి లండన్ పర్యటన జగన్కు రిలీఫ్గా భావించినా... ఆయన వచ్చేసరికి వరుస పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో నాయకుల్లో హడావుడి, ఆందోళన ఉందంటున్నారు.