జస్టిస్ ఎన్వీరమణపై ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు- జగన్ వాదనేంటి ? పిటిషనర్ల వాదనేంటి ?
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఛీఫ్ జస్టిస్కు సీఎం జగన్ రాసిన లేఖ మరోసారి తెరపైకి రానుంది. వివాదాస్పద లేఖ రాసిన జగన్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపబోతోంది. అయితే ఈ కేసులో సీఎం జగన్ రాసిన లేఖ వెనుక ఆయన చెబుతున్నట్లు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవ్యవస్ధ పనిచేస్తోందా ? లేక తమపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు ఆదేశాలిచ్చిన జస్టిస్ ఎన్వీరమణను టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. పిటిషనర్లు మాత్రం ఎన్వీ రమణ ఆదేశాల తర్వాత జగన్ రాసిన లేఖ కచ్చితంగా ఆయన్ను టార్గెట్ చేయడమే అంటున్నారు.
Recommended Video

జగన్ లేఖ వెనుక మర్మమేంటి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణపై ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ, ఆ తర్వాత దాన్ని బహిర్గతం చేసిన విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ చర్యలను పలు న్యాయవాద సంఘాలు, బార్ కౌన్సిళ్లు తప్పుబట్టాయి. అయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా దీన్ని ఖండించినా, దాని అధ్యక్షుడు దుష్యంత్ దవే మాత్రం లేఖపై విచారణ జరపాలని, తప్పుంటే జగన్ను శిక్షించాలని, అంతే తప్ప విచారణ జరగకుండానే ముందస్తు అభిప్రాయానికి రావడం సరికాదని తెలిపారు. వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ జగన్ లేఖ వెనుక అసలు కారణాలేంటన్న చర్చ మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. దీనిపైనా సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ లేఖకు కారణమిదే అంటున్న పిటిషనర్లు..
జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఛీఫ్ జస్టిస్కు చేసిన ఫిర్యాదు వెనుక పలు కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పిటిషనర్ల వాదన మాత్రం అంతకంటే పెద్ద విషయమేదో దాగుందన్న అనుమానాలకు కారణమవుతోంది. ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖకు కొద్ది రోజుల ముందు సుప్రీంకోర్టు రాజకీయ నేతలపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... పెండింగ్ కేసులను ఏడాది లోగా విచారించి దోషులకు శిక్ష ఖరారు చేయాలని, నిర్దోషులుగా తేలితే వదిలిపెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలే జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదుకు దారి తీశాయని పిటిషనర్లు చెబుతున్నారు.

జస్టిస్ రమణను అందుకే టార్గెట్ చేశారా ?
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి కమ్ కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్ తన లేఖలో ఆరోపించారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు న్యాయమూర్తులతో తీర్పులు ఇప్పిస్తున్నారనే అర్ధం వచ్చేలా జగన్ ఆరోపణలు చేశారు. వీటిని న్యాయనిపుణుడైన మాజీ ఎంపీ ఉండవల్లి ఆరుణ్ కుమార్ వంటి వారు కూడా తప్పుబట్టారు. అలా జరిగే అవకాశం లేదని విశ్లేషించారు. కానీ జగన్ మాత్రం తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖను తన ముఖ్య సలహాదారు అజేయకల్లంతో బయటపెట్టించారు. జగన్ రాసిన లేఖలో పేర్కొన్న కారణాలు సహేతుకమా కాదా అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పుడు విచారణ చేయబోతోంది. కానీ పిటిషనర్ల వాదన ప్రకారం చూస్తే తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్తో పాటు ఇతర ఆర్ధిక నేరాల కేసులను సత్వర విచారణ జరిపేందుకు జస్టిస్ ఎన్వీరమణ ఇచ్చిన ఆదేశాలపై ఆగ్రహంతోనే ఆయనపై ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

జగన్, పిటిషనర్ల వాదనలు ఊహాజనితమే..
వాస్తవానికి న్యాయనిపుణులు చెబుతున్న దాని ప్రకారం జగన్ తన ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారని చెబుతున్న కారణం, జస్టిస్ రమణ రాజకీయ నేతలపై పెండింగ్ కేసుల సత్వర విచారణకు ఇచ్చిన ఆదేశాల వల్లే జగన్ ఎదురుదాడికి దిగారని చేస్తున్న వాదన రెండూ ఊహాజనితంగానే కనిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలను సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ధారించాల్సింది సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రమే. కానీ జగన్ చేస్తున్న ఓ ఊహాజనిత వాదనతో పిటిషన్లు మరో ఊహాజనిత వాదన తీసుకొచ్చి కోర్టు ధిక్కరణ, సీఎం పదవి నుంచి తొలగింపు కోరుతుండటం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. మొత్తం మీద ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పలు ఇతర కేసులపైనా ప్రభావం చూపబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications