షర్మిలతో గొడవల వేళ.. జగన్ వాట్ నెక్స్ట్?
YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవంక సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతోండగా.. మరోవంక కుటుంబపరంగా లుకలుకలను ఎదుర్కొంటోన్నారు.
ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇది కాస్తా పిటీషన్లు వేసే స్థాయికి వెళ్లింది. గతంలో ఇదే విషయంపై జగన్ చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతాలే జగన్ కుటుంబంలో చోటు చేసుకున్నాయి.

జగన్పై సొంత బావ, ఎవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆస్తి కోసం తన తల్లి, చెల్లినీ లెక్క చేయట్లేదంటూ మండిపడ్డారు. ఆస్తుల కోసం ఎందాకైనా వెళ్తాడని, వారిద్దరిపైనా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో పిటీషన్లు వేయడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారు.
ఈ గొడవల వ్యవహారం వైఎస్ఆర్సీపీ క్యాడర్ను సైతం తీవ్రంగా ప్రభావితం చేసింది. క్షేత్రస్థాయిలో నిరుత్సాహాన్ని నింపింది. క్యాడర్ మొత్తం డీలాపడింది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నుంచి ఎదురవుతున్న విమర్శలను ధాటిగా తిప్పికొట్టలేకపోతోంది.
ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య వైఎస్ జగన్ సొంత జిల్లా కడపకు వచ్చారు. కొద్దిసేపటి కిందటే ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళి అర్పించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్లారు.
వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, కడప, అన్నమయ్యా రాయచోటి జిల్లాల పార్టీ నాయకులు ఉన్నారు.
ఇడుపులపాయలో పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి అవసరమైన అంశాలపై చర్చించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, క్షేత్రస్థాయిలో క్యాడర్ను కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిట్టచివరి కార్యకర్తకూ ఎలాంటి అవసరం వచ్చినా పార్టీ పరంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications