వారికి జగనన్న ఆణిముత్యాలు; రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహకాలు!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాలను అందిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి విద్యా సంస్కరణలు తీసుకు వస్తున్న జగన్, చిన్నారుల చదువుకు తల్లిదండ్రులకు కావలసిన ఆర్థిక భరోసాను కూడా అందిస్తున్నారు.
జగనన్న విద్యా కానుక ద్వారా చిన్నారులకు వారికి కావలసిన మూడు జతల యూనీఫాం లు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్ తదితరాలు కిట్ లలో అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను అందిస్తున్నారు.

అంతేకాదు అమ్మ ఒడి ద్వారా బడికి వెళుతున్న చిన్నారుల కోసం ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం కింద ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద లో భాగంగా రాగిజావను అందిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
అంతేకాదు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మరింత ప్రోత్సహించడం కోసం జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. నియోజక వర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జూన్ 15న, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జూన్ 17వ తేదీన, రాష్ట్ర స్థాయిలో జూన్ 20వ తేదీన జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలను అందించనున్నారు.

ఇక రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీఎం జగన్ స్వయంగా ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఎక్కడైనా తల్లిదండ్రులు కోరుకునేది విద్యార్థులకు మంచి చదువు చెప్పించి, వారి భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపించడమే. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం అందిస్తున్న అనేక పథకాలు, తల్లిదండ్రులకు పిల్లల చదువుకు సంబంధించి భరోసా ఇస్తున్నాయి. ఇది భవిష్యత్తు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications