జగన్ మరో అస్త్రం "జగనన్నకు చెబుదాం"- జనం కళ్ళలో ఆనందం కోసం-ఎన్నికల వేళ కొత్త ప్రయోగం..
ఎన్నికల వేళ ఏపీలో జనం కళ్లలో సంతృప్తి చూసేందుకు సీఎం జగన్ కొత్త ప్రయోగానికి తెరదీశారు. సంక్షేమం లాగే ఫిర్యాదుల పరిష్కారమూ సంతృప్తిగా ఉండేలా జగనన్నకు చెబుదాం పేరుతో కొత్త కార్యక్రమం తెస్తున్నారు.
ఏపీని నాలుగేళ్లుగా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సీఎం జగన్ ఇప్పుడు అదే ఊపుతో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సంక్షేమంలో ఎలా అయితే సంతృప్తికర స్ధాయికి వెళ్తున్నారో అలాగే ఫిర్యాదుల పరిష్కారంలోనూ సంతృప్తికర స్ధాయికి వెళ్లేలా కొత్త ప్రయోగం చేపడుతున్నారు. దీన్ని త్వరలో అమల్లోకి తెచ్చేందుకు సిద్దంగా ఉండాలని సీఎం జగన్ ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
"జగనన్నకు చెబుదాం"
ఏపీలో వైసీపీ సర్కార్ త్వరలో "జగనన్నకు చెబుదాం" పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న స్పందన కార్యక్రమానికి వస్తున్న స్పందన, ఫిర్యాదుల పరిష్కారంతో జనం పూర్తి సంతృప్తికరంగా లేరన్న నివేదికల నేపథ్యంలో అంతకు మించిన కార్యక్రమాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో జనం నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదునూ వారి సంతృప్తికర స్ధాయిలో పరిష్కరించి చూపించాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం లక్ష్యాల్ని ఇవాళ సీఎం జగన్ అధికారులకు వివరించారు.
"జగనన్నకు చెబుదాం" లక్ష్యమిదే..
రాష్ట్రంలో ప్రస్తుతం స్పందన కార్యక్రమాన్ని ప్రతీ సోమవారం క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జనం నుంచి భారీ ఎత్తున ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు. అయితే వీటి పరిష్కారానికి వచ్చే సరికి పలు సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో సదరు ఫిర్యాదుల్ని సంతృప్తికర పరిష్కారం లేకుండానే ముగించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి కూడా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని "జగనన్నకు చెబుదాం" కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
రెడీగా ఉండాలన్న జగన్
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా "జగనన్నకు చెబుదాం" కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్ చేయాలని జగన్ ఆదేశించారు. అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయాలన్నారు. దీనిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలన్నారు. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలని జగన్ సూచించారు. అలా అయితేనే కార్యక్రమం సవ్యంగా సాగుతుందన్నారు.
క్షేత్రస్ధాయిలో అమలు ఇలా..
జగనన్నకుచెబుదాం కార్యక్రమం అమలు కోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్లను అనుసంధానం చేయబోతున్నారు. వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలని సీఎం జగన్ ఇవాళ ఆదేశించారు. సీఎంఓతోపాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలన్నారు. తర్వాత జిల్లాస్థాయిలోనూ, మండలస్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇలాంటి మానిటరింగ్ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఉండాలన్నారు. మానిటరింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యక్రమం బాగా జరుగుతుందని జగన్ సూచించారు. ఫైనల్ గా స్పందనకు అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే '' జగనన్నకు చెబుదాం'' అని జగన్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలని, ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యమని జగన్ తెలిపారు. పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలన్నారు. పలానా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తిరస్కరణకు గురైనా జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలన్నారు. అవినీతికి సంబంధించి అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలన్నారు.