జగనన్న చేదోడు .. మరో సంక్షేమ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ .. వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
ఏపీ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంలో ముందు వరుసలో ఉంటుంది . ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కార్ తన దూకుడు కొనసాగిస్తుంది. కరోనా లాక్ డౌన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా సాయం అందించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు . తాజాగా నేడు జగనన్న చేదోడు పథకం ద్వారా టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించే బృహత్తర పథకాన్ని నేడు ప్రారంభించారు సీఎం జగన్ .
Recommended Video
జగన్ మార్క్ సంక్షేమం: 10రోజుల్లో బియ్యం, పింఛన్ కార్డులు, 20రోజుల్లో ఆరోగ్య శ్రీ
సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న చేదోడు పథకం
జగనన్న చేదోడు పథకాన్ని నేడు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు సీఎం జగన్ . ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఇక జగనన్న చేదోడు పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.247.04 కోట్లు జమ చెయ్యబడతాయి . నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసిన ఏపీ ప్రభుత్వం నేరుగా వారికే ఈ సహాయం అందిస్తోంది.
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామన్న సీఎం జగన్
‘జగనన్న చేదోడు' అనే పేరుతో ఈ బృహత్తర పథకం శ్రమనే నమ్ముకున్న వారి కోసం అందిస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు . వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోని భగవద్గీత , ఖురాన్ , బైబిల్ లా భావిస్తున్నదని , హామీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు . అర్హులు గ్రామ ,వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో జగనన్న చేదోడు పేరుతో రూ. 10వేల సాయం
జగనన్న చేదోడు పథకం ఐదేళ్ళ పాటు కొనసాగనుందని తెలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించాలని ఏపీలో అధికారంలోకి వచ్చిన తోలిరోజుల్లోనే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది . ఇక ఇప్పుడు కరోనాతో రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా సరే జగన్ మాత్రం సంక్షేమం ముందుకు సాగాల్సిందే అని పథకాల అమలును సీరియస్ గా తీసుకున్నారు . మొన్నటికి మొన్న ఆటోవాలాలకు, ట్యాక్సీ వాలాలకు ఆర్ధిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నాయీ బ్రాహ్మణులకు , రజకులకు , టైలర్లకు ఆర్ధిక సాయం అందిస్తుంది.