మగాడివైతే బైటకు రా: ఆంధ్రా పార్టీపై కెటిఆర్కు జగ్గారెడ్డి
కెసిఆర్కు ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రజల సమస్యలు ఎలా ఉంటాయో తెలియదని, హైదరాబాదులో కూర్చోవడం జై తెలంగాణ అనడం తప్ప వారికి ప్రజల సమస్యలు తెలియవన్నారు. వారి పోరాటం అంతా మీడియాలో కనబడటం కోసమేనని మండిపడ్డారు.
కెసిఆర్ ఎప్పుడైనా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లారా చెప్పాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కెటిఆర్ విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. కెటిఆర్ నీ బతుకెంత... నీ జీవితం రాజకీయం, అవగాహన ఎంత అని ఘాటుగా ప్రశ్నించారు.
తెలంగాణవాదం పక్కన పెట్టిరా.. నీ దమ్మేంటో చూద్దామని, మగాడివైతే తెలంగాణవాదం ముసుగులోంచి బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మీడియాలో ఉనికి ఉంటుందని ఆరాటపడుతున్నారని ఆయన ఆరోపించారు.
నీ తండ్రి కెసిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ప్రజలకు కనబడేవారని, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పని చేయలేదా అని ప్రశ్నించారు. ఆనాడు ఆంధ్రోళ్ల పార్టీలో ఎందుకున్నారో చెప్పాలన్నారు. ఇరవై ఏళ్లు ఆ పార్టీ మోచేతి నీళ్లు ఎందుకు తాగారో చెప్పాలని ధ్వజమెత్తారు.