మా ప్రత్యర్ధులకు జగన్ డబ్బులిస్తున్నారు - సీఎం సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు వ్యతిరేకంగా పని చేసిన వారికి డబ్బులు ఇస్తున్నారంటూ వాపోయారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. అక్కడ జరిగిన సభలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తన నియోకవర్గ పరిధిలో ఇథనాల్ ప్లాంట్ తీసుకురావటం పైన హర్షం వ్యక్తం చేసారు.
పరిశ్రల్లో స్థానికులకు 75 శాతం అవకాశం ఇవ్వాలనేది మంచి నిర్ణయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. అభివృద్ధి జరగాలంటే మౌళిక వసతులు సదుపాయాలు ఉండాలని..భవిష్యత్ మరిన్ని పరిశ్రమలకు తమ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ సీఎం అయిన తరువాత.. తాము ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరితో అయితే పోరాటం చేసామో వారికి కూడా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే సీఎం జగన్ పైన కోపానికి కారణమైందన్నారు. తమ కార్యకర్తలు కూడా తాము పోరాటం చేసిన వారికి డబ్బులు వేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.

కానీ, ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం లో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్తున్న తమకు వాస్తవం ఏంటో అర్దమైందన్నారు. సహజంగా ఏ విషయంలోనూ రాజీ పడే అలవాటు లేని తనకు సీఎం అమలు చేస్తున్న పథకాలు..నిర్ణయాల్లోని తత్వం బోధపడి, ఆ తరువాత కన్వీన్స్ అయ్యానని ఎమ్మెల్యే వివరించారు. గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా లబ్ది దారుల ఇళ్లకు వెళ్తుంటే హారుతలు ఇస్తున్నారని..ఘన స్వాగతం పలుకుతున్నారని అప్పుడు తాము పూర్తిగా అసలు విషయం అర్దమైందని చెప్పుకొచ్చారు. పేద ప్రజలు ఈ సంక్షేమ పథకాలను ఆదరిస్తున్నారని.. ఎన్నో పార్టీలు..నేతలు వచ్చారు వెళ్లారని..కానీ, జగన్ మాత్రమే తమకు మేలు చేస్తున్నారంటూ వారంతా చెబుతున్నారని వేదిక పైనే వివరించారు.
ఒక దశలో తాను రాజకీయాలు మానేద్దామని భావించానని ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి వెళ్లే విధానాలతో రాజీ పడలేక ఆ నిర్ణయానికి వచ్చానన్నారు. కానీ, సీఎం జగన్ పిలుపుతో తాను నిర్ణయం మార్చుకొని, జగన్ ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొచ్చారు. తాను సీఎం జగన్ పైన ఆగ్రహం తో ఉన్నందుకు ఎమ్మెల్యే వేదికపైనే క్షమాపణ కోరారు. జగ్గంపేటకు కావాల్సిన అభివృద్ధి పనుల చిట్టాను సభలో ప్రస్తావించారు ఎమ్మెల్యే వ్యాఖ్యలను సీఎం జగన్ నవ్వుతూ ఆలకించారు. ఆ తరువాత ఎమ్మెల్యే కోరిన అభివృద్ధి పనుల చిట్టాకు ఆమోదం తెలిపారు.












Click it and Unblock the Notifications