ఆర్థిక సంఘం చెప్పలేదు, వేలకోట్ల నష్టం, వెంకయ్య ఆ పదవి కోసమే: హోదాపై జైరాం సంచలనం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం ఎన్డీయేదేనని, హోదా ఇవ్వకుంటే ఏపీకి రూ.60వేల కోట్ల నష్టమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ఇవిచ్చాం: 'లెక్క' చెప్పిన వెంకయ్య, బాబుకు భయంలేదని జగన్కు కౌంటర్
ఏపీని విభజిస్తున్న సమయంలో నాటి తమ ప్రభుత్వం (యూపీఏ) ఇచ్చిన హామీలను ఇప్పటి ఎన్డీయే సర్కారు తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. తాము చెప్పింది ఒకటైతే, ఇప్పుడు జరుగుతోంది మరొకటి అన్నారు. దీనివల్ల విడిపోయిన రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదన్నారు. హోదా ఇవ్వద్దని చెప్పినట్టు ఎక్కడైనా ఉంటే తనకు చూపాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోవాలని సూచించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టేందుకు వీల్లేదన్నారు.
కేంద్రం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని బిజెపి అర్థం చేసుకోలేదన్నారు. చట్టంలోని 13వ షెడ్యూల్ను ఓసారి చదవాలన్నారు. కేంద్రమంత్రి జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఏమీ లేదని, రాష్ట్రానికి వచ్చేదేంటో తనకు తెలియడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీ వాసులకు ద్రోహం చేస్తోందన్నారు.
హోదా ఇవ్వని పాపం ఆర్థిక సంఘానిది కాదని, మోడీ ప్రభుత్వానిది అన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు పెద్ద మనిషి తరహా వ్యవహరించలేదన్నారు. వెంకయ్య చెప్పేవన్నీ కంటితుడుపు మాటలే అన్నారు. ఉప రాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య అలా చేస్తున్నారన్నారు. చట్టసవరణ లేకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పగించరన్నారు.
ఉన్నది చేయండి: కావూరి
ఏపీని విభజించిన సమయంలో చేసిన చట్టాన్ని తొలుత ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నట్టుగా రైల్వే జోన్ సహా అన్ని హామీలనూ అమలు చేయాలన్నారు.
అది వదిలేసి ఎప్పుడిస్తారో, ఎలా ఇస్తారో చెప్పకుండా బోడి ప్యాకేజీలేంటని ప్రశ్నించారు. జైరాం రమేష్ను ఆయన కలిశారు. అనంతరం మాట్లాడారు.
ప్యాకేజీలంటూ, లక్షల కోట్ల సాయమంటూ ప్రజలను మభ్యపెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లు గడుస్తున్నా, చట్టంలోని అనేక హామీలింకా అమలు కాలేదన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ పైన విమర్శలు చేయడం గమనార్హం.