హైద్రాబాద్ ఓ పాఠం, ఉద్యోగుల ఇష్టం: సీమాంధ్రపై జైరాం
గుంటూరు: అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదని హైదరాబాద్ పాఠం నేర్పిందని కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్ మంగళవారం అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో హైకోర్టు, అసెంబ్లీ, ఇతర కార్యాలయాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాయన్నారు. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెసు పార్టీ ముందుంటుందని చెప్పారు. 2014 ఎన్నికల కోసం తాము తెలంగాణ ఇవ్వలేదన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి చేస్తామన్నారు. సీమాంధ్ర రాజధానిపై వారంలోగా నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. తెలంగాణ అనేది దశాబ్దాల డిమాండ్ అని, ఎన్నికల లబ్ధి కోసం ఇవ్వలేదని చెప్పారు. సీమాంధ్రలో రాజధాని కోసం చాలా నగరాలు ఉన్నాయన్నారు.

అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదని హైదరాబాద్ నేర్పిన పాఠమన్నారు. సీమాంధ్రలో అధికార వికేంద్రీకరణ చేస్తామన్నారు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట, రాజధాని మరోచోట ఉన్నాయన్నారు. కృష్ణా జలమండలి తెలంగాణలో, గోదావరి జలమండలి సీమాంధ్రలో ఉంటుందని చెప్పారు. జలమండలి అధ్యక్షులను కేంద్రప్రభుత్వమే నియమిస్తుందన్నారు. విద్యార్థులు, యువత ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకాలు కలుగవన్నారు.
సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా సీమాంధ్ర అభివృద్ధిపై బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు.. ఇలా అన్నింటిని సీమాంధ్రలో వేర్వేరు చోట ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర అభివృద్ధిపై అనుమానాలు అవసరం లేదన్నారు. పదేళ్ల వరకు విద్యావ్యవస్థలో మార్పులు ఉండవని చెప్పారు. జలమండళ్లో రాజకీయ నాయకులు ఉండరని, విజ్ఞులు ఉంటారని చెప్పారు. ఉమ్మడి ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలనుకునేది వారే నిర్ణయించుకోవచ్చునని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెసు, బిజెపిలపై ఉందన్నారు.
విజయవాడలో...
సాయంత్రం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ఆరు నెలల్లో సీమాంధ్ర రాజధాని ఎంపిక పూర్తవుతుందన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే చివరగా కాంగ్రెసు పార్టీ తీసుకుందని చెప్పారు.












Click it and Unblock the Notifications