చంద్రబాబుకు పెద్ద దెబ్బే, అలా కుదరదు..!: సీట్ల పెంపుపై జైరాం కీలక వ్యాఖ్య
అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ప్రక్రియ అంత సులువు కాదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. విభజన చట్టం రూపకల్పన సమయంలోనే దీనిపై చర్చ జరిగిందని ఆయన అన్నారు. ఏపీ విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
2026 వరకూ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అనేది సాధ్యం కాదని, తాను జార్ఖండ్ కోసం రెండేళ్లు కృషి చేసినా ఫలితం దక్కలేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం డిమాండ్లు వస్తున్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే సీట్ల పెంపు ప్రక్రియను చేపట్టడం కుదరకపోవచ్చని అన్నారు.
''డీలిమిటేషన్ను 2026 వరకూ సీల్ చేస్తూ పార్టమెంట్ చట్టాన్ని ఆమోదించింది. అందువల్ల ప్రస్తుతానికి రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపుకు అవకాశం ఉందంటున్నారు. అయితే అది ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఉంది'' అని ఆయన స్పష్టం చేశారు.
వాస్తవానికి జనాభా ఆధారంగా అయితే 2026 కంటే ముందుగా అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పిన ఆయన ఇందుకు ఒక ఉదాహరణకు కూడా చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయినప్పుడు శాసనసభ సభ్యుల సంఖ్యా బలం 81గా పార్లమెంట్ ఖరారు చేసిందని అన్నారు. అయితే జార్ఖండ్ జనాభా, కేరళ జనాభా సమానంగా ఉన్నాయి.
కాగా కేరళ శాసన సభ సంఖ్యా బలం 140. దీంతో జార్ఖండ్ శాసనసభ సంఖ్యా బలం కూడా 140కి పెంచాలని మేం రెండేళ్లు ప్రయత్నించి విఫలమయ్యామని చెప్పారు. అయితే ఏపీ విభజన బిల్లును తాను ఆమోదించిన ఏ చట్టాన్నైనా, ఎప్పుడైనా పార్లమెంట్ సవరించవచ్చని ఆయన తెలిపారు.
అయితే ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియలో కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడాలని అన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే రాష్ట్రాల మొత్తం సంఖ్యాబలంలో మార్పులు సాధ్యమవుతాయని, అయితే అది కేవలం ఒక్క రాష్ట్రం కోసం సాధ్యం కాదని వివరించారు.
అయితే మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇరకాటంలో పడేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఏపీలో నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుందనే ఆశతో ఆయన ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.
ఈ కారణం చేతనే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి వస్తున్నా టీడీపీకి చెందిన నేతలు వారిని అడ్డుకోవడం లేదని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వైసీపీ నుంచి ఎంతమంది వస్తే అంత మందిని పార్టీలో చేర్చుకోవాలని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనేది అధినేతే పార్టీ నేతలకు సూచించారని సమాచారం.
అయితే తాజాగా జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలతో అసలు అసెంబ్లీ సీట్ల పెంపు కుదురుతుందా? లేదా అనే ఆలోచన నేతల్లో మొదలైంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియకు సంబంధించిన తంతుని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన భుజానికి ఎత్తుకున్నారు.
ఇప్పటికే కేంద్రం హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శలతో పలుమార్లు సమావేశమైన సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని సీట్ల పెంపు ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారో మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టత ఇవ్వాలని జైరాం రమేశ్ కోరారు.
మరోవైపు అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తన పని తాను చేయాలని ఆయన సూచించారు.