అలా ఐతే తెలంగాణ రాకపోయేది: జానా సంచలనం, ఊరుకోమని బొత్స
హైదరాబాద్: ఉమ్మడి రాజధానికి ఒప్పుకోకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులు, నోటుకు ఓటు వ్యవహారం తారాస్థాయికి చేరుకుందని చెప్పారు.
నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తాము చేసిన పనులు చూడకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదన్నారు. రికార్డులు చూస్తే తాము చేసిన పనులు కనిపిస్తాయని చెప్పారు.
పదేపదే కాంగ్రెస్ పార్టీని నిందించవద్దన్నారు. నేడు హైదరాబాదులో తెరాస నేతలు తాగుతున్న నీరు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏమాత్రం మంచిది కాదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందో విచారించవలసి ఉందని చెప్పారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపులు ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నప్పటికీ శిక్షించాలన్నారు. స్టీపెన్తో జరిపిన సంభాషణలు చంద్రబాబువా కాదా చూడాలన్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఎవరిని వేధించాల్సిన అవసరం లేదన్నారు.
సీబీఐ విచారణ కోరండి: బొత్స
ఓటుకు నోటు వ్యవహారంలో తన తప్పు లేకుంటే చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ పైన నిందలు సరికాదన్నారు. మీరు చేసిన తప్పులను ఆంధ్ర ప్రజలు మోయాలా అని ప్రశ్నించారు.
సీఎం ఫోన్ ట్యాప్ చేయడం నేరమైతే దానికి చట్టాలున్నాయని, దానికి వ్యతిరేకంగా చట్ట ప్రకారం పోరాడాలని బొత్స సూచించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వీధిపోరాటాలు చేస్తుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఒంటెద్దు పోకడలకు పోతూ ఇలాంటి కార్యక్రమాలు సరికాదన్నారు.
ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రివి కదా అని చెప్పి ఇంకో రాష్ట్రంలో చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తామంటే ఎవరూ అంగీకరించరన్నారు. ఓటుకు నోటు వ్యవహారం ఆడియో టేపుల్లో గొంతు తనది కాదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంలో నీకు సంబంధం లేదని కానీ, నీ అనుచరులు కాని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఏదైనా ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలన్నారు. నటనలో చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ను మించిపోయాడన్నారు. బలం ఉన్న చోటే తమ పార్టీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు.