జగదీశ్వర్ చెల్లని రూపాయి, పార్టీ నుండి వెళ్తారు.. వస్తారు: జానా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ చెల్లని రూపాయి అని, ఆయన కుసంస్కారి అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానా రెడ్డి సోమవారం మండిపడ్డారు. జగదీశ్వర్ రెడ్డి గురించి తాను మాట్లాడటం తన స్థాయికి తగింది కాదన్నారు. అవినీతికి పాల్పడిన జగదీశ్వర్ రెడ్డి పైన చర్యలకు పట్టుబడతామన్నారు. జగదీశ్వర్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తనను కలిసిన అంశంపై మాట్లాడుతూ.. సస్పెన్షన్ ఎత్తి వేయించాలని వారు తనను కోరారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల పైన కూడా జానా స్పందించారు.
చిన్నపరెడ్డి తెరాసలో చేరుతున్నారనేది అప్రదాన్యత అంశమని చెప్పారు. పార్టీ నుండి రోజుకు ఒకరు వెళ్తుంటారు.. మరొకరు వస్తుంటారని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం ఎవరెవరో ఎక్కడెక్కడో చేరుతుంటారని చెప్పారు. అలాంటి వాటి గురించి మాట్లాడటం సరికాదన్నారు.
అన్ని వర్గాల ఆశలను తెరాస నీరుగార్చింది: డీఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అన్ని వర్గాల వారి ఆశలను నీరుగార్చిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఆ పార్టీ మండలి నేత డీ శ్రీనివాస్ విమర్శించారు. హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ మాటలు మాత్రమే చెబుతున్నారని, ఆచరణలో ఏమీ లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని గతంలో చెప్పారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్త ఉద్యోగాలంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతున్నారన్నారు.