Encounter: బెత్తం దెబ్బలు కాదు గానీ: నేర స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా సరే: పవన్ కల్యాణ్!
అమరావతి: మహిళలు, ఆడిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ఉరి శిక్ష విధించడం సరి కాదని, అలాంటి వారికి రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని కొద్దిరోజుల కిందటే సంచలన ప్రకటన చేశారు జనసేన పార్టీ పవన్ కల్యాణ్. ఆయన ఈ ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు.

చట్టాలు సరిపోవు...
ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏ మాత్రం సరిపోవని వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం స్పష్టం చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని ఆవేదనను వ్యక్తం చేశారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడం డాక్టర్ దిశ హత్యోదంతం ఎంత తీవ్రమైనదో స్పష్టం చేస్తోందని చెప్పారు.

మరే బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదు..
డాక్టర్ దిశ హత్యోదంతానికి పోలీసులు ఈ ఎన్ కౌంటర్ తో ముగింపు పలికారని, మరే ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు తీసుకొచ్చినప్పటికీ.. అత్యాచారాలు ఆగలేదని, ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయని అన్నారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉందని అన్నారు.

ఇతర దేశాల్లో చట్టాలపై అధ్యయనం..
మహిళలు, చిన్న పిల్లలపై ఆకృత్యాలకు పాల్పడిన వారిపై ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు అమలులో ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. మేధావులు తమ ఆలోచన శక్తితో ఇలాంటి ఘాతుకాలకు చరమాంకం పాడేలా చేయాలని చెప్పారు. ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాల్సి ఉంటుందని, రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలను రూపొందించుకోవాలని అన్నారు.

బహిరంగ శిక్షలు అమలు చేయలి..
ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేసే దిశగా దేశవ్యాప్తంగా చర్చలు జరగాలని అన్నారు. నేర స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందని, ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications