జగన్ బాటలో.. జగన్నే ఢీ కొట్టేలా: ఎల్లుండి నుంచే..!!
విజయనగరం: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం.. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నాయి. భారతీయ జనత పార్టీ, జనసేన దీనికి తీసిపోవట్లేదు. అధికార పార్టీపై ఎదురు దాడులు సాగిస్తోన్నాయి.

జగన్ తరహాలోనే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే- ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్షాప్లను నిర్వహిస్తోన్నారు. అదే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుసుకుంటోన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నేతలను ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై జగన్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

చంద్రబాబు కర్నూలు పర్యటనతో..
అటు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జిల్లా పర్యటనలకు పూనుకున్నారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు ఆయన పర్యటించారు. కర్నూలు, ఆదోని వంటి పట్టణాల్లో రోడ్ షోలను నిర్వహించారు. బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా త్వరలో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోన్నారు. జనవరి 27వ తేదీన ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి తన పాదయాత్రను ప్రారంభించడానికి సమాయాత్తమౌతోన్నారు.

జనసేన కూడా..
ఈ పరిణామాల మధ్య జనసేన పార్టీ కూడా అదే బాటలో నడవనుంది. జిల్లా, నియోజకవర్గాల స్థాయి నేతలతో భేటీ కానుంది. ఎల్లుండే దీనికి ముహూర్తం పెట్టింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఇందులో పాల్గొనున్నారు. క్యాడర్కు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ కోసం ఇప్పటికే అజెండాను కూడా ఖరారు చేసింది జనసేన పార్టీ అగ్ర నాయకత్వం.

బీజేపీతో పొత్తుపై
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన.. భారతీయ జనత పార్టీతో పొత్తులో కొనసాగుతోంది. అది ఎన్నికల వరకు ఎంత మేరకు కొనసాగుతుందనేది అనుమానమే. పవన్ కల్యాణ్.. చంద్రబాబు వెంట వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన బీజేపీతో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన అడుగుల ఎటు పడతాయనేది ఆసక్తి రేపుతోంది.

ఎల్లుండి నుంచి కీలక భేటీలు..
వైఎస్ జగన్ నిర్వహిస్తోన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీ నేతలతో భేటీ తరహాలోనే జనసేన కూడా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. పవన్ కల్యాణ్ కూడా నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి భేటీ ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విజయనగరం జిల్లా నేతలతో అక్కడే ఉంటుందని చెబుతున్నారు. ఇందులో నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని, జిల్లాస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు.

కీలక భేటీ..
జిల్లా స్థాయి నాయకులందరూ ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. మొన్నీమధ్యే పవన్ కల్యాణ్ ఇదే విజయనగరం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. గుంకలాంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. జగన్ ప్రభుత్వంపై అక్కడే ధ్వజమెత్తారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే జిల్లాతో నియోజకవర్గ స్థాయి భేటీలను పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications