చాలామంది వస్తున్నారని తెలిసింది, సంతోషం: పవన్, పొలిటికల్ లీడర్గా ఫోటో షూట్
హైదరాబాద్: జనసేన ఆవిర్భావం రోజు జనసైనికులమైన మనందరికీ పండుగ రోజు అని, ప్రజాస్వామ్యవాదులకు వేడుకైన రోజు అని, జనసేనను అభిమానించే వారందరూ ఒకచోట కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల సేవకు పునరంకితం అయ్యే రోజు అని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Recommended Video

మార్చి 14వ తేదీ నాటికి జనసేన పుట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. జనసేన సిద్ధాంతాలు, నాలుగేళ్ల ప్రయాణంపై ప్రజా వేదిక నుంచి మాట్లాడే తరుణం ఆసన్నమవుతోందని పేర్కొన్నారు.

14న గుంటూరులో ఆవిర్భావ సభ
ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుందని ప్రకటన విడుదల చేశారు. సభకు వచ్చే ప్రతి కార్యకర్త క్షేమంగా తిరిగి స్వస్థలానికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, నాయకులను స్మరించుకునేలా సభా ప్రాంగణం, స్వాగత తోరణాలకు పేర్లు ఉంటాయన్నారు.

నాటి నుంచి నేటి వరకు
నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో పార్టీ ఏర్పాటు ప్రకటనను సభా ముఖంగా ప్రకటించిన నాటి నుంచి సాగిన ప్రస్థానంపై పార్టీ అభిమానులు, నాయకులతో సభ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పవన్ పేర్కొన్నారు. సభ కోసం భారీ ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపారు.

ఆ పనులు ప్రణాళికాబద్దంగా
సభకు జనసైనికులు భారీగా తరలి వస్తున్నట్లు అందుతున్న సమాచారం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో రక్షణ, ఇతర వసతులు, సభ ప్రతి ఒక్కరికి కనిపించేలా చర్యలు, బారీకేడింగ్ తదితర పనులు ప్రణాళికాబద్దంగా సాగుతున్నాయన్నారు.

స్వాగత తోరణాలు
సభ నిర్వహణకు సంబంధించిన అంతర్గత కమిటీలు చురుగ్గా పని చేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ఘనంగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల కోసం త్యాగాలు, అనితర సేవ చేసిన నాయకులను స్మరించుకునేలా ప్రాంగణాలు, స్వాగత తోరణాలకు పేర్లు ఉంటాయని తెలిపారు.

పొలిటికల్ టచ్ కోసం ఫోటోలు
ఇదిలా ఉండగా, సభ కోసం, త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటన కోసం పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయ నాయకుడిలా ఫోటోలు దిగారని తెలుస్తోంది. పొలిటికల్ లీడర్ స్టయిల్లో ఉండే ఫోటోలను సభ సందర్భంగాను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోటోలు దిగారు.












Click it and Unblock the Notifications