విశాఖకు పవన్: వారాహి యాత్రకు భద్రత కారణాలు- అభిమానులకు జనసేన సూచనలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి పెట్టారు. వారాహి యాత్రలో భాగంగా మొన్నటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన ఇక.. సాగరనగరం విశాఖపట్నంలో అడుగుపెట్టనున్నారు. గురువారం విశాఖకు వెళ్లబోతోన్నారు. సాయంత్రం 5 గంటలకు జగదంబ జంక్షన్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పార్టీ నాయకత్వం ఇప్పటికే పూర్తి చేసింది. పవన్ కల్యాణ్ సభను విజయవంతం చేయడానికి ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో పలుమార్లు సమీక్షలను నిర్వహించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతిపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించింది.

గన్నవరం విమానాశ్రయం నుంచి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖ విమానాశ్రయం నుంచి కారులో పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి వారాహి వాహనంపై ర్యాలీగా జగదంబ జంక్షన్కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు పవన్ కల్యాణ్.. జగదంబ జంక్షన్కు చేరుకుంటారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
విశాఖ వారాహి యాత్ర సందర్భంగా.. భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ నాయకత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. వారాహి విజయ యాత్రలో గానీ, సభా వేదికల వద్ద గానీ.. క్రేన్లతో పవన్ కల్యాణ్కు భారీ దండలు, గజమాలలను వేయొద్దని సూచించింది. వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.
వారాహి బస్సు యాత్ర సాగే మార్గంలో భారీ క్రేన్లు, వాహనాలను ఏర్పాటు చేయడం వల్ల కాన్వాయ్ సాఫీగా సాగట్లేదని పార్టీ నాయకత్వం అభిప్రాయపడింది. సమాయనుగుణంగా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోలేకపోతోన్నారని పేర్కొంది. ఇదివరకు పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించినప్పుడు ఓ అభిమాని క్రేన్ సహాయంతో గాల్లో ఎగురుతూ పవన్ కల్యాణ్ పూల మాలను వేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications