అడిగి చేస్తా: పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచన!, టిడిపి దాడి చేస్తే వారికే రివర్స్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపటి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని పవన్ పదేపదే చెబుతున్నారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపటి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని పవన్ పదేపదే చెబుతున్నారు.
మరో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సరికొత్త ఆలోచన తెరపైకి తీసుకు వచ్చారు! సాధారణంగా ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది. తాము అధికారంలోకి వస్తే వీటిని నెరవేర్చుతామని చెబుతుంటాయి.
ఇందుకోసం మేనిఫస్టోలు కూడా విడుదల చేస్తాయి. అయితే, పవన్ అందరికంటే భిన్నంగా ఆలోచించారు. జనసేన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల నుంచి వచ్చే సూచనల ఆధారంగా రూపొందిస్తామని పవన్ స్పష్టం చేశారు.
చేనేత దీక్షలో పవన్ కళ్యాణ్ ప్రసంగం...
పార్టీ ఏర్పాటై 14 మార్చి 2017కు మూడేళ్లు పూర్తవుతున్నందున ఆ రోజు పార్టీ వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, రాజధాని, చేనేత.. ఇలా ఏ రంగంలోని సమస్యలనైనా ఇందులో ప్రస్తావించవచ్చునని సూచించారు.
అలా వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని జనసేన పార్టీ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ప్రజల సూచనలతో పాటు పవన్ పార్టీ తరఫున హామీలు కూడా ఇవ్వవచ్చు. అది వేరే విషయం. కానీ ప్రజల సూచనల ఆధారంగా తమ మేనిపెస్టో ఉంటుందని చెప్పడం గమనార్హం.
అందరూ హామీలు ఇస్తారు కానీ..
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెరాస, టిడిపిలు ప్రధానంగా రుణమాఫీపై హామీ ఇచ్చాయి. ఎవరి రాష్ట్రంలో వారు చాలా హామీలే ఇచ్చారు. ఏపీలో బీజేపీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలనే నెరవేర్చడం లేదని విపక్షాలు నిత్యం విమర్శిస్తున్నాయి. పవన్ మాత్రం రివర్స్గా.. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి మేనిపెస్టో రూపొందించనున్నారు.
ఇలా చెప్పేశారు
మంగళగిరిలో సోమవారం జరిగిన చేనేత సత్యాగ్రహ దీక్షలో పవన్ కళ్యాణ్ పలు అంశాలపై పరోక్షంగా, ప్రత్యేక్షంగా... ఓవిధంగా సూటిగానే చెప్పారు. పవన్ మాటలను పట్టి 2019 ఎన్నికల్లో ఆయన ప్రచార అస్త్రాలు ఏమిటో దాదాపు తేలిపోయింది.
చేనేత సభలో కొందరికి సున్నితంగా, ఇంకొందరికి ఆవేశంగా, మరికొందరికి ఆగ్రహంతో మాట్లాడినట్లు కనిపించినప్పటికీ.. కొన్ని అంశాలపై తేల్చేశారు.
నాడు జగన్, రేపు లోకేష్.. బాబు రివర్స్
2014 ఎన్నికల్లో తాను చంద్రబాబుకు మద్దతివ్వడానికి.. ఆయన అనుభవమే కారణం అని పవన్ పలుమార్లు చెప్పారు. నాటి ఎన్నికల సమయంలో పరోక్షంగా అయినా.. జగన్ అన్ ఫిట్ అని, 2019 ఎన్నికలకు లోకేష్ అన్ ఫిట్ అని చెప్పారని అంటున్నారు. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదు కానీ.. బలవంతంగా రుద్దవద్దని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు లోకేష్కే తగులుతాయని అంటున్నారు.
2019లో పవన్కూ వర్తింపు
నిన్న జగన్కు, ఇప్పుడు నారా లోకేష్కు వర్తించింది.. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు కూడా వర్తిస్తుందని గుర్తు చేసే వారు లేకపోలేదు. ఎందుకంటే ఆయనకు కూడా రాజకీయాలు కొత్తే. అయితే, తనకు అధికారం, పదవి ముఖ్యం కాదని పవన్ చెబుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం అభ్యర్థి కాకపోవచ్చుననే వాదనలు ఉన్నాయి.
టిడిపిని అలా కార్నర్
రాజధాని సహా పలుచోట్ల భూసేకరణ, కాపు రిజర్వేషన్, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన పలు హామీలు, ప్రజలు వ్యతిరేకించే చోట పరిశ్రమలు.. ఇలా ఎన్నింటి పైనో చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలనే ఆయన టార్గెట్ చేస్తూ.. టిడిపిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి సమాధానం ఇవ్వడం లేదా, ఎదురు దాడి చేయడం వేరే విషయం.
ప్రత్యేక హోదానే అసలు సమస్య
2019 ఎన్నికల నాటికి ప్రత్యేక హోదానే ఏపీలో కీలకమైన ప్రచార అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోదాకు సమానమైన ప్యాకేజీ, దానికి చట్టబద్దత అని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ప్రత్యేక హోదాకు ఏదీ సరిపోదని విపక్షాలు అంటున్నాయి. ప్యాకేజీ వల్ల లాభం ఉన్నప్పటికీ.. పవన్ సహా విపక్షాలు దీనినే ఆయుదంగా చేసుకోనున్నాయి. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చెప్పినా అంత ఫలితం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిలదీత ప్రారంభించారు
2014 ఎన్నికల సమయంలో టిడిపి - బిజెపి కూటమికి పవన్ మద్దతిచ్చారు. ప్రచారం చేశారు. అదే సమయంలో తాను మద్దతిచ్చిన పార్టీలు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పారు. ఆయన కొద్ది కాలం వేచి చూసి నిలదీయడం ప్రారంభించారు.
స్నేహం కొనసాగకపోవచ్చుననే..
తొలి నాళ్లలో.. అంతో ఇంతే ఇప్పటికీ.. పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రతి సమస్య పైన చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. పవన్ దూరమవుతున్నాడని తెలిసి.. ఇటీవల టిడిపిలో కొంత మార్పు కనిపిస్తోంది. పవన్ పైన ఎదురుదాడికి కూడా సై అంటున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కూడా మాట్లాడుతూ.. పవన్ మిత్రపక్షమా అని మీడియా అడగగా.. స్నేహం కొనసాగుతుందనే అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తం కాలేదు. అంటే పవన్ దూరమయ్యాడని భావించి.. ఆయన విమర్శలు చేస్తే.. అంతే ఘాటుగా స్పందించేందుకు టిడిపి సిద్ధంగా కనిపిస్తోందని అంటున్నారు.
ఎదురు దాడికి దిగితే పవన్కు ప్లస్
ఇన్నాళ్లు పవన్ నిలదీసినప్పుడు సానుకూలంగా స్పందించి.. ఇప్పుడు విమర్శలు చేస్తే అది పవన్కే ప్లస్ అంటున్నారు. జగన్ రాజకీయం చేస్తున్నారని భావిస్తున్నందువల్ల ఆయన విమర్శలను పట్టించుకోవడం లేదని, కానీ పవన్ సమస్యల పైన నిలదీసినప్పుడు.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిందని, తద్వారా ఆయన నిలదీత సరైనదేనని ఇన్నాళ్లు అంగీకరించిందని, ఇప్పుడు మరింత గట్టిగా నిలదీయడం.. దూరమవుతున్నాడని భావించి ఎదురు దాడికి దిగితే మాత్రం అందరూ అర్థం చేసుకుంటారని అంటున్నారు. మరో విషయం ఏమంటే.. పవన్కు అధికార యావ లేదని, ఇచ్చిన హామీ మేరకు నిలదీస్తే తప్పేమిటని భావిస్తారని అంటున్నారు.
మొత్తానికి 2019 ఎన్నికల నాటికి
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నందున ఎపీలో రసవత్తర రాజకీయం కనిపించనుంది. టిడిపి - వైసిపి - జనసేనలతో త్రిముఖ పోరు ప్రధానంగా కనిపించనుంది. టిడిపి - బిజెపిలు కలిసి ఉంటే.. ఫరవాలేదు.. లేదంటే కమలం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. ఇలా చతుర్ముఖ, పంచముఖ పోరుకూ అవకాశముంది.