రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవ్వనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ .. ప్రజా క్షేత్రంలో పర్యటనలకు ప్లాన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారా ? గత కొంత కాలంగా కరోనా కారణంగా ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ త్వరలో ఏపీ టూర్ చెయ్యాలని భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ టూర్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపునుందా? అంటే అవును అనే సమాధానం చెబుతున్నారు జనసేన నాయకులు.
కడప క్వారీలో పేలుడులో 10 మంది మృతి తన హృదయాన్ని కలచివేసిందన్న పవన్ కళ్యాణ్
త్వరలో ఏపీ రానున్న జనసేనాని పవన్ కళ్యాణ్
త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటానికి మరోమారు పర్యటించాలని నిర్ణయించుకున్నారు.తిరుపతి ఉప ఎన్నిక పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది. ఆ తర్వాత ఆయన కోలుకోవడానికి దాదాపు నెల రోజులకు పైగా పట్టింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రజా జీవితానికి దూరంగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిన పవన్ రాజకీయాలకు దూరంగా ఉండటంతో జనసేన పార్టీ లోనూ పార్టీ నాయకుల లో ఉత్సాహం తగ్గింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలపై జనసేనని గళం విప్పాల్సిన అవసరం ఉందన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
కరోనా తర్వాత ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల్లేవు
అంతకుముందు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, కరోనా సోకిన తర్వాత నుండి ఇప్పటివరకు షూటింగులలో కూడా పాల్గొనడం లేదు. ఇక ఇప్పుడు ఏపీలో పార్టీని ముందుకు నడిపించాలన్న భావనతో, గత మూడు నెలలుగా పార్టీ వైపు నుంచి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రం లోని వివిధ సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించనునట్లుగా సమాచారం.
వారం రోజుల్లో ఏపీకి ... ప్రజా క్షేత్రంలో సమస్యలపై పోరాటాలకు ప్లాన్
వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏపీకి రానున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని, అలాగే కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పార్టీ తరపున ప్రభుత్వంపై ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాల్సిన అంశాలపై పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో చర్చించినట్లుగా తెలుస్తుంది. పార్టీని బలోపేతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో మళ్ళీ పార్టీలో జోష్
ఇక పవన్ కళ్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్న వార్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన నాయకులలో నూతనోత్సాహం నెలకొంది. అయితే ఏపీలో ఇప్పటివరకు అనేక ప్రజా సమస్యలపై, టిడిపి నేతలపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ నిత్యం పోరాటం చేస్తున్న వేళ, ఏపీలో సమస్యలపై ప్రశ్నించడంలో ముందు వరుసలో ఉండే పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించకపోవడంతో ఇటీవల కాలంలో జనసేన పార్టీ కాస్త వెనుకబడింది. మళ్లీ పార్టీని, పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ మరోమారు ప్రజాక్షేత్రంలో పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.