బీజేపీ సూచనతో ఎన్నికల్లో పోటీ పై పవన్ కీలక నిర్ణయం..!?
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కర మలుపులు తీసుకుంటోంది. ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. జగన్ ను ఓడించేందుకు జత కట్టిన చంద్రబాబు, పవన్ తో ఇప్పుడు బీజేపీ కలవటం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలోనే సీట్ల కేటాయింపు కీలకంగా మారుతోంది. 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసే నియోజకవర్గం పై ప్రకటన చేయలేదు. తాజాగా, బీజేపీ సూచనలతో పోటీ పైన పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
పవన్ నియోజవకర్గం : వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 2014 తరహాలో కూటమిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో సీట్ల సర్దుబాబు వ్యవహారం పైన మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు పోటీ చేసే స్థానాల పైన స్పష్టత వచ్చింది. జనసేనలోని కొందరు నేతల నియోజకవర్గాలు ఖరారయ్యాయి. చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి, నాదెండ్ల మనోహర్ తెనాలి, నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిన పవన్ ఈ సారి నియోజకవర్గం ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

పొత్తులు - లెక్కలు : ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలనేది పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, తాజాగా బీజేపీ కూటమిలో చేరటం ఖాయమైన వేళ ఆ పార్టీ నేతల నుంచి పవన్ కు కీలక సూచన అందినట్లు సమాచారం. పవన్ ను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీతో పాటుగా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని సూచించారని తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో కూమటి అధికారంలోకి వస్తే ఇక్కడ కీలక పాత్ర...ఫలితం మరో రకంగా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చేలా ముందస్తుగా ఈ సచూన చేసారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పవన్ భీమవరం, పిఠాపురం, తిరుపతి వంటి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారని చెబుతున్నారు. కాకినాడలో మూడు రోజులు మకాం వేసిన పవన్ అక్కడ పార్టీ బలం పైన పూర్తి సమాచారం సేకరించారు.

రెండు స్థానాల్లో పోటీ : తాజాగా పార్టీ నేతల సమాచారం మేరకు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి.. కాకినాడ నుంచి ఎంపీగానూ పోటీ చేస్తారని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో ఈ సారి పూర్తిగా కూటమి గెలవాలనేది పవన్ తన లక్ష్యంగా ఇప్పటికే ప్రకటించారు. పశ్చిమ గోదావరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం ద్వారా ఆ జిల్లాలో, కాకినాడ ఎంపీగా బరిలో నిలవటం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రభావం చూపించవచ్చని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. స్థానికంగా నేతలతో చర్చల సమయంలోనూ ఈ రెండు స్థానాల్లో పోటీ పైన పవన్ ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం పైన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో..జనసైనికుల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications