ఆ ఐదింటిపై ఉడుంపట్టు పట్టిన పవన్ కల్యాణ్
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా ఎంచుకున్నారు. వైసీపీ విముక్త ఏపీ ఒక్కటే తమ లక్ష్యమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు. దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను నిలువరించేందుకు ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఉత్తరాంధ్రపై పవన్ రాజకీయం
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలపై దృష్టిపెట్టే బదులు తనకు బలమున్న నియోజకవర్గాల్లోను, గత ఎన్నికల్లో 25 నుంచి 30వేల లోపు ఓట్లు పొందిన నియోజకవర్గాలపై జనసేనాని ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. ఈ 5 ఉమ్మడి జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా తన రాజకీయాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై కేంద్రీకరించారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని పవన్ అంచనా వేస్తున్నారు.

ఈ 5 జిల్లాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు..
తెలుగుదేశం పార్టీతో పొత్తున్నప్పటికీ, పొత్తు లేకపోయినప్పటికీ ఈ ఐదు జిల్లాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందేలా పవన్ అడుగులు వేస్తున్నారు. కౌలు రైతులకు పరిహారం అందించేందుకు తూర్పుగోదావరికి వచ్చిన సందర్భంగా ఈ జిల్లా వాసులు తలుచుకుంటే ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించారు. తర్వాత విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకోవడం, జనవాణి వాయిదా పడటం, హోటల్ గది నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించడంతోపాటు విశాఖ వదిలివెళ్లాలని నోటీసులివ్వడం.. చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడటంలాంటి పరిణామాలన్నీ జరిగాయి. టీడీపీతో పొత్తు ఖాయమయ్యే సమయానికి ప్రధానమంత్రితో భేటీ అవడంతో రాజకీయాలు మళ్లీ మారిపోయాయి.

తరుచుగా ఉద్దానం పర్యటన
గతంలో శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు ఉద్ధానం పర్యటించారు. తరుచుగా పవన్ ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. విజయనగరం గుంకలాంలో జగనన్న ఇళ్ల అవినీతిపై మండిపడ్డారు. అభిమానులు ఎక్కువగా ఉండటం, యువత మొత్తం పవన్ వైపు ఉండటంతో వాటిని ఓట్ల రూపంలోకి మలుచుకోవాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చింతలపూడి వరకు ఈ 5 ఉమ్మడి జిల్లాల్లో 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మెజారిటీ సీట్లను ఇక్కడి నుంచే సాధించుకొని కింగ్ మేకర్ కావాలనుకుంటున్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే తనకు వచ్చిన సీట్లే కీలకమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి విజయనగరం జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటిపై చర్చించేందుకు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనితర్వాత శ్రీకాకుళంపై దృష్టిసారిస్తారు.












Click it and Unblock the Notifications