''గోదావరి''ని ఈదుతున్న జనసేనాని పవన్ కల్యాణ్?
ఉభయ గోదావరి జిల్లాలను జనసేనాని పవన్ కల్యాణ్ సులువుగా ఈదేస్తున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీని నడపడంలో, రాజకీయం చేయడంలో కొంత తడబడినప్పటికీ 2019లో ఓటమి పాలైన తర్వాత పవన్లో మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. రాజకీయం కూడా బాగా ఒంటబట్టిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే గోదావరి జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. తూర్పు గోదావరి ప్రజలు తలుచుకుంటే తాను ముఖ్యమంత్రి అవగలనని పవన్ వ్యాఖ్యానించారు. ఆవిర్భావ సభలో పొత్తులకు సిద్ధమని ప్రకటించిన పవన్ టీడీపీ, జనసేన మధ్య ఈ విషయమై సందిగ్ధత నెలకొనడంతో ప్రస్తుతానికి ఒంటరి పయనానికి సిద్ధమయ్యారు.

ఈ రెండు జిల్లాల నుంచే సాధ్యమైనంత ఎక్కువగా..
గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ పార్టీ ఎక్కువ ఓట్లు సాధించింది. ఈ నియోజకవర్గాలన్నింటిపై దృష్టిపెట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను సాధించాలని యోచిస్తున్నారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 సీట్లున్నాయి. కాపు సామాజికవర్గంతోపాటు క్షత్రియ సామాజికవర్గం కూడా బలంగా ఉంది. వీరిని తనవైపు ఆకట్టుకోగలిగితే రాబోయే ఎన్నికల్లో అత్యధి సీట్లు ఈ రెండు జిల్లాల నుంచే సాధించాలనే రాజకీయ వ్యూహంతో జనసేనాని ముందుకు వెళుతున్నారు.

కింగ్ మేకర్ గా అవతరించాలని..
అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తోన్న పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో సామాజికవర్గం దన్నుగానైనా కింగ్ మేకర్గా అవతరించాలని, తన మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాలను, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటున్నారు. 175 నియోజకవర్గాలపై దృష్టిసారించడంకన్నా తమకు బలం ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని చెమటోడిస్తే సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకోవచ్చనేది జనసేన ఆలోచనగా ఉంది.

4 నియోజకవర్గాల నుంచి ఆహ్వానం
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ఈసారి మాత్రం అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. తమ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలంటూ తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఆయనకు నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. గెలిస్తే విజయం సులభమంటూ అందుకు తగ్గ లెక్కలను కూడా వివరిస్తున్నారు.
ప్రస్తుతం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. పోటీచేస్తే విజయం ఎలా ఉంటుందనే విషయమై ఒక నియోజకవర్గంలో సర్వే కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఆయన తీసుకునే నిర్ణయం, అమలు చేసే వ్యూహరచన పవన్ తోపాటు మరికొంతమందిని అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయడంతోపాటు జనసేన భవిష్యత్తును కూడా నిర్ధేశించబోతోంది.












Click it and Unblock the Notifications