అటు సినిమాలు.. ఇటు రాజకీయం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వారాంతంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. ఈ సమయంలో పార్టీ కార్యక్రమాల రూపకల్పన, భవిష్యత్తులో అనుసరించాల్సి వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. పార్టీని నడపడానికి నగదు అవసరం కాబట్టి తమ నాయకుడు సినిమాలు చేయడం తప్పనిసరైందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. వారాహి యాత్ర కూడా చేయాలనుకున్నప్పటికీ ప్రభుత్వం నవంబరు, డిసెంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, చివరి 6 నెలలు వారాహితో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించవచ్చనే భావనలో పవన్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు ఎంత అసవరమో.. జనసేనకు తెలుగుదేశం పార్టీతో పొత్తు కూడా అంతే అవసరం. వచ్చే ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తాను కూడా స్వయంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కృతనిశ్చయంతో పవన్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తువల్లే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని భావిస్తున్నారు. రాజకీయాల్లో మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అనుకున్న వైసీపీ, జనసేన మధ్య యుద్ధం జరగడంలేదు. ప్రస్తుతం వైసీపీ, తెలుగుదేశం హోరాహోరీగా తలపడుతున్నాయి.

పవన్ కల్యాణ్ వచ్చినరోజు, ప్రసంగించినరోజే జనసేన వార్తల్లో నిలుస్తోంది. తర్వాత షరా మాములే. పార్టీని బలోపేతం చేయడానికి పవనే స్వయంగా పర్యటించాల్సి ఉంది. ఆయన మినహా ప్రజాదరణ కలిగిన నాయకులెవరూ పార్టీలో లేరు. దీంతో అన్ని బాధ్యతలు పవన్ పైనే ఉన్నాయని చెప్పవచ్చు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున పవన్ ఇస్తున్నారు. తన సినిమాల రెమ్యునరేషన్ నుంచే దీన్ని ఖర్చుపెడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఒక అవగాహన ఉందని భావిస్తున్నారు. వైసీపీకి, జనసేనకు మాటల యుద్ధం నడిచినరోజే జనసేన ప్రభావం కనపడుతోందని, పవన్ పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే వైసీపీని సులువుగా ఎదుర్కొంటామని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీతో పొత్తువల్ల కొన్ని సీట్లను గెలుచుకుంటామనే ధీమా కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.













Click it and Unblock the Notifications