ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టిన పవన్ కల్యాణ్!
పవన్ కల్యాణ్ ను ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు పూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోయేవారు. తన షెడ్యూల్ ప్రకారం చేయాల్సినవన్నీ చేసుకునేవారు. కానీ ఏపీ రాజకీయం మొత్తం పూర్తిగా మారిపోయింది. అతన్ని పదే పదే ఇబ్బందులకు గురిచేయడంద్వారా ప్రజల్లో సానుభూతి వచ్చేలా చేయడంతోపాటు తనకు అండగా ఉంటారనే కారణంతో తెలుగుదేశం పార్టీవైపు చూసే పరిస్థితి వచ్చింది.

ఒంటరి పోరాటం అన్న వ్యక్తి..
నిన్నటి వరకు పొత్తున్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. అవసరమైతే ఒంటరి పోరాటానికి కూడా సిద్ధం.. మనకు బలమున్న చోట గెలిచి కింగ్ మేకర్ గా అవతరించాలనే ఆలోచనలో ఉండేవారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు పొత్తు ఉండి తీరాల్చిందే అన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఇప్పటికిప్పుడు ఏ ప్రకటనలు రాకపోయినా భవిష్యత్తులో జరగబోయేది సుస్పష్టం.
అంతేకాకుండా దూకుడైన రాజకీయం చేయడానికి కూడా నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ కలిసి వచ్చినా సరే, రాకపోయినా సరే మేం వెళ్లిపోతున్నాం అంటూ పొత్తులకు సంబంధించిన బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టారు. అదే క్రమంలో తాను ఎటువంటి పరిస్థితుల మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా.. రాజకీయంగా వ్యూహం మార్చుకున్నా.. పరిస్థితులను బట్టేనని, కానీ తనకు మోడీమీద కానీ, బీజేపీ మీద కానీ వ్యతిరేకత ఉన్నట్లు కాదని వ్యాఖ్యానించారు.

పొత్తు విషయంలో స్పష్టతగా ఉన్న జనసేనాని
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంవల్ల రాష్ట్రంలో సొంతంగా ఎదగలేమనే అభిప్రాయాన్ని పలువురు జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ కు స్పష్టత ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.జనసేన తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా పర్యటనలకు సైతం అడ్డంకులేర్పడుతున్నాయి. దీంతో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైన పార్టీ అండ ఉండాలనే అభిప్రాయానికి వచ్చేశారు.

ఆవిష్కృతమైన నాయకత్వ పటిమ
విశాఖపట్నంలో జరిగిన సంఘటనలతో పవన్ కల్యాణ్ లో దూకుడైన రాజకీయ నేతే కాకుండా సమస్య ఎదురైనప్పుడు పరిష్కరించుకోవడానికి వేగంగా నిర్ణయం తీసుకోగలిగే నాయకత్వ పటిమ కూడా ఆవిష్కృతమైంది. భవిష్యత్తులో తాను చేసే పోరాటాలకు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మద్దతు లభించనుంది. మరోవైపు బీజేపీ కూడా తన నిర్ణయాన్ని తప్పక చెప్పాల్సిన పరిస్థితిని కల్పించారు.












Click it and Unblock the Notifications