ముల్లును ముల్లుతోనే తీయాలి... ''ఒక్క ఛాన్స్ ఇవ్వండి''..?
పొత్తుల సంగతి ఎలా ఉన్నా ముందుగా జనసేన పార్టీని బలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో చర్చించి ఎక్కడెక్కడ ఏయే నిర్ణయాలు తీసుకోవాలి అనేదానిపై స్పష్టత తీసుకున్నారు. ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా ముందస్తుగా జరిగే అవకాశముండటంతో గేరు మార్చి వేగాన్ని పెంచారు.
ఎన్నికల వరకు కొత్త సినిమాలు ఒప్పుకోలేదు
రెండు సినిమాలను ఒప్పుకున్న పవన్ కల్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా నిర్మాత, దర్శకులకు ఎన్నికలైన తర్వాత చేద్దామని చెప్పేశారు. హరిహర వీరమల్లుతోపాటు మరో చిత్రానికి కాల్షీట్లు కేటాయించారు. ఆ తర్వాత ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడించాలంటే పార్ట్ టైమ్ పొలిటీషియన్ లా వ్యవహరిస్తే కుదరదని అర్థమైంది. దీంతో ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత పూర్తికాలం ఎన్నికలపై దృష్టిపెట్టబోతున్నారు.
ఒక స్లోగన్ అందిపుచ్చుకొని ప్రజల్లోకి వెళ్లాలని..
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నియోజవర్గాలకు ఇన్ ఛార్జిలు లేని చోట వారి నియామకాలను పూర్తిచేయబోతున్నారు. తమ పోరాటం ఉధృతంగా ఉంటేనే అనుకున్న లక్ష్యానికి చేరుకోగలమని పవన్ భావిస్తున్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీలకు ఉన్నట్లుగా జనసేనకు కూడా ఒక స్లోగన్ ను ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అవినీతి రహిత పాలన అందిస్తా
గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను పదే పదే అభ్యర్థించారు. అది వారి మనసుల్లో నాటుకుపోయింది. ఒక్కసారే కదా.. అంటూ ఓటేసి గెలిపించారు. విశాఖపట్నం పర్యటన నుంచి గుంకలాంలో జగనన్న ఇళ్లను పరిశీలించేవరకు పవన్ ఒక మాటే చెబుతున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, అలా ఇస్తే అవినీతి రహిత పాలన అంటే ఏమిటో తాను చూపిస్తానంటున్నారు. తన జేబులో డబ్బులు తీసి ప్రజల కోసం ఖర్చుపెడుతున్నానని, అటువంటిది తాను అవినీతికి ఎలా పాల్పడతానని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జనసేనను గెలిపించాలని కోరుతున్నారు. కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జనసేన యంత్రాంగం కృషిచేస్తోంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని, ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తానని హామీ ఇస్తున్నారు. తనకూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరుతున్న పవన్ ఈ స్లోగన్ బాగా పనిచేస్తోందని, ప్రజల్లో మార్పు వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. వైసీపీ, టీడీపీ పరిపాలనను చూసిన ప్రజలకు జనసేనవైపు మొగ్గుతారని ఆ పార్టీ యంత్రాంగం ఆశాభావంతో ఉంది.