పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం- విశాఖ ఉక్కు కోసం దీక్ష : ఇక, బీజేపీతో తెగతెంపులేనా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పైన పునరాలోచించాలని కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని పదే పదే చెబుతూ వస్తోంది. దీంతో..విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 300 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అన్ని పార్టీలు మద్దతు వారి పోరాటానికి మద్దతు ప్రకటించాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు.

కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా
ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాసారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరుతూ...అదే సమయంలో అమ్మకం కాకుండా ఎటువంటి నిర్ణయాలతో ప్లాంట్ కాపాడుకొనే అవకాశం ఉందో వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ అంశం పైన అఖిల పక్షంతో కలిసేందుకు సమయం ఇవ్వాలని ప్రధానిని కోరారు. కానీ, ప్రధాని నుంచి సమాధానం లేదు. ఇక, కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖ లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో కేంద్ర నిర్ణయాన్ని పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు అడ్డుకోవాలని డిమాండ్ చేసారు.

విశాఖ కేంద్రంగా వైసీపీకి అల్టిమేటం
కేంద్ర బిల్లులకు మద్దతిస్తున్న వైసీపీ ఈ విషయం పైన ఎందుకు నిలదీయదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని..వారం రోజుల్లోగా ప్రభుత్వం ఏం చేయనుందో స్పష్టత ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారి చేసారు. కానీ, దాని పైన ఏపీ ప్రభుత్వం స్పందించ లేదు. ఇక, స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇవ్వటంతో..ఇప్పుడు పవన్ కళ్మాణ్ దీక్షకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 12వ తేదీన సంఘీబావ దీక్ష చేయాలని నిర్ణయించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు నిరవధిక ఆందోళన కొనసాగిస్తున్నారు.

పార్టీ కార్యాలయంలో ఒక రోజు దీక్ష
వారికి మద్దతుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ తో పాటుగా నాదెండ్ల మనోహర్.. పీఏసీ సభ్యులు.. పార్టీ జిల్లాల నేతలు సైతం దీక్షలో పాల్గొంటారు. పవన్ విశాఖ సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసారు. ఇప్పుడు ఈ దీక్ష వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా.. లేక, నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం పైన మాట్లాడతారా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షగా పార్టీ నేతలు చెబుతున్నారు.
Recommended Video

బీజేపీతో పొత్తు పై నీలి నీడలు
కొంత కాలంగా ఏపీలో బీజేపీ - జనసేన మైత్రి ఉన్నా..అది నామ్ కే వాస్తే అన్నట్లుగా మారిపోయింది. దీంతో..ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే దీక్ష చేయటం ద్వారా ఆయన పరోక్షంగా బీజేపీకి దూరమవుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారనే చర్చ మొదలైంది. టీడీపీ నేతలు కొందరు బహిరంగంగానే పవన్ - టీడీపీ మరోసారి పొత్తు పెట్టుకోవాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు వైసీపీని ఓడించటం లక్ష్యంగా అనధికార పొత్తులతో పోటీ చేసాయి. ఇప్పుడు, పవన్ దీక్ష బీజేపీ తో మైత్రి పైన ప్రభావం చూపిస్తుందనే అంచనాలు..ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications