Pawan Kalyan Upma Story : పవన్ చెప్పిన ఉప్మా స్టోరీ వైసీపీకా ? టీడీపీకా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగడతానంటూ రెండేళ్లుగా చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నాల్లో ఇప్పటికీ సక్సెస్ కాలేదు. ఓవైపు విపక్షాల ఐక్యత పేరుతో పవన్ టీడీపీ, బీజేపీ నేతల్ని వరుసగా కలుస్తున్నా పొత్తుల లెక్కలు మాత్రం ఇంకా తేలలేదు. దీనికి ఇతర విపక్షాల నుంచి పూర్తిస్ధాయిలో మద్దతు లభించడం లేదా ? లేదా ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారా ? అన్న చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభించి ఈసారి తనను సీఎం చేయాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. దీంతో పవన్ రాజకీయం మారుతుందని భావిస్తున్న వారికి తాజాగా ఆయన మరో షాక్ ఇచ్చారు.

ఏపీలో వైసీపీ సర్కార్ పై తాజాగా ముమ్మిడివరం సభలో పవన్ విమర్శలు గుప్పించారు. ఇది 70:30 సర్కారు అన్నారు. వందమంది ప్రజల్లో 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును వైసీపీ సర్కారు తనకు కావాల్సిన 30 మందికి పంచుతూ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. కేవలం రాజకీయం కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలను వాడుకుంటోందన్నారు.
అంతటితో ఆగకుండా వైసీపీని ఓ ఉప్మా పార్టీగా పవన్ అభివర్ణించారు. ఆ తర్వాత ఉప్మా స్టోరీ ఒకటి చెప్పారు. ఓ వసతిగృహంలో రోజువారీ ఉప్మా పెడుతుంటే, అంతా ఎదురు తిరిగారని, మాకు ఉప్మా వద్దని నిరసన వ్యక్తం చేశారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏం కావాలో ఓటింగ్ పెట్టారని, 18 మంది యధావిధిగా ఉప్మా కావాలని కోరితే, మిగిలిన 82 మంది వివిధ రకాల టిఫిన్ల పేరు చెప్పారన్నారు. అయితే ఉప్మా కోరుకున్న వారి సంఖ్యే అన్నిటి కంటే ఎక్కువ ఉండటంతో మళ్లీ ఉప్మా దిక్కు అయిందన్నారు.
వైసీపీ కూడా ఉప్మా తరహా పార్టీనే అని, వైసీపీ వద్దు అనుకుంటున్న వారిలో ఐక్యత అవసరమని టీడీపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విపక్షాల్లోని అనైక్యతే వైసీపీకి బలమన్నారు. అనైక్యతను వీడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే కచ్చితంగా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. తద్వారా ఇప్పటికైనా జనసేనతో టీడీపీ కలిసి రావాలని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. అదే సమయంలో వైసీపీ బలాన్ని కూడా టీడీపీకి గుర్తుచేసినట్లయింది.












Click it and Unblock the Notifications