'తూర్పు'న గెలిచి ఉదయించాలనుకుంటున్న పవన్ కల్యాణ్!
ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగే ఎన్నికలను జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటే రావడం, కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపించడంతోపాటు పార్టీ అధినేత పోటీచేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవడం జనసేన శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటినుంచే రానున్న ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా తనతోపాటు మరింతమంది జన సైనికులను అసెంబ్లీకి తీసుకురావడానికి ఆయన శతథా ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యూహం మార్చిన పవన్ కల్యాణ్?
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దృష్టిసారించి దెబ్బతినడంతో ఈసారి ఆయన వ్యూహం మార్చారు. పార్టీ గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ రెండోస్థానంలో నిలిచింది? ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు? జిల్లాలు? తదితర విషయాలను గమనంలోకి తీసుకొని అందుకనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటున్నారు. పవన్ కూడా దూకుడుగా రాజకీయం చేస్తుండటంతో ఈసాని జనసేన శ్రేణులు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామనే ఆశను భారీగా పెంచుకున్నాయి. ఇప్పటికిప్పడు కింగ్ కాకపోయినా కింగ్ మేకర్గా అవతరించాలనే ప్రణాళికతో పవన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.

ఐదు జిల్లాల్లో ప్రబలంగా ఉన్న పార్టీ ప్రభావం
కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్న జిల్లాలో పవన్ పార్టీ భారీగా ఓట్లను చీల్చింది. ఇతర జిల్లాల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో పార్టీకి బలమున్నచోటే నాలుగు సీట్లు సంపాదించుకోవడానికి జనసేనాని ఉద్యుక్తులయ్యారు. ఆయన ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాపై దృష్టిసారించారు. గత ఎన్నికల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో 19 నియోజకవర్గాలకు వైసీపీ 14 సాధించింది. విడిగా పోటీచేస్తే తెలుగుదేశం, జనసేన ఇద్దరికీ నష్టమే కావడంతో రానున్న ఎన్నికలకు కలిసి పోటీచేయాలనే ఆలోచన చేస్తున్నాయి.

తూర్పుగోదావరిలో 14 స్థానాల్లో ప్రభావం
తూర్పు గోదావరిలో 22 శాతం ఓట్లు ఉండటంతోపాటు మొత్తం 19 నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థాయికి జనసేన ఎదిగింది. గత ఎన్నికల్లో వైసీపీకి 14 రాగా, టీడీపీకి నాలుగు, జనసేనకు ఒకటి వచ్చింది. అంతేకాకుండా పెద్దాపురం, ప్రత్తిపాడు, మండపేట, జగ్గంపేట, రాజోలు, పిఠాపురం, ముమ్మడివరం, పి.గన్నవరం, అమలాపురం, రామచంద్రాపురంతోపాటు రాజమండ్రి సిటీ, రూరల్, కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ ప్రభావం ప్రబలంగా ఉంది. కాకికాడ రూరల్, పిఠాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్ స్థానాలను జనసేన గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications