మళ్లీ పవన్ ఒక్కడే.. అనంతలో జనసేన ఫీవర్.. ఏం చెప్పబోతున్నారు? (ఫోటోలు)
అనంతపురం : అనంత వేదికగా మరో భారీ బహిరంగ సిద్దమయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నేటి సాయంత్రం 4గం.లకు మొదలయ్యే ఈ సభ కోసం ఇప్పటికే సర్వం సిద్దం కాగా.. నగరమంతా జనసేన ఫీవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అటు అభిమానులతో పాటు.. ఇటు మీడియా కూడా పవన్ సభపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఏం చెప్పబోతున్నారు?
ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక హోదాపై గొంతెత్తిన పవన్.. ఈసారి స్పష్టమైన ప్రకటన చేస్తారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్నటిదాకా పవన్ ఎప్పుడూ మాట్లాడిన టీడీపీని గానీ చంద్రబాబును గానీ సూటిగా విమర్శించే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేక హోదాపై అటు మోడీని కూడా ఇంతవరకు నిలదీసే ప్రయత్నం చేయలేదు. మరి ఈ సభ ద్వారా ఆయనేం చెప్పాలనుకుంటున్నారు..? ఎలా తన పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.. అన్న విషయాలకు ఆయన్నుంచి సమాధానాలు వచ్చే అవకాశముంది.
వైసీపీ గురించి ప్రస్తావిస్తారా?
ఇక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశమేంటంటే.. ప్రస్తుతం ప్రత్యేక హోదా మీద ప్రతిపక్ష పార్టీ గట్టిగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో అదే నినాదంతో తెరపైకి వచ్చిన పవన్.. ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న పోరాటంపై కనీస స్పందన తెలియజేస్తారా? లేక ఎప్పటిలాగే వైసీపీ ఊసు లేకుండా ముగించేస్తారా అన్నది వేచి చూడాలి.
పాత 'లెక్క'నే కొనసాగిస్తారా?
కలిసొచ్చే పార్టీలతో కలిసి హోదాపై పోరాటం చేస్తామన్న పవన్ గత వ్యాఖ్యలను బట్టి చూస్తే.. నిజానికి వైసీపీ పోరాటంపై కనీస మాత్రంగానైనా స్పందించడమో.. లేక ప్రతిపక్ష పార్టీ పోరాటాన్ని రాజకీయం అని తేల్చేయడమో ఉండాలి. ఇవేవి లేకపోతే.. వైసీపీ విషయంలో పవన్ తన పాత వైఖరినే కొనసాగించినట్టు లెక్క.
గట్టి భద్రతా ఏర్పాట్లు :
ఇక సభ విషయానికొస్తే.. సభా వేదికకు కల్లూరు సుబ్బారావు పేరు, మైదానానికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టిన సంగతి తెలిసిందే. వీఐపిల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభ జరిగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రెండు, బయట మూడు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంలో భద్రత కోసం దాదాపు 800పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. మరో 300మంది రిజర్వులో ఉన్నట్టు సమాచారం.
వేదికపై మళ్లీ ఒక్కడే..
ఇక ఎప్పటిలాగే వేదికపై పవన్ ఒక్కరే కనిపించే అవకాశం కనిపిస్తోంది. హోదాపై తన అభిప్రాయాలు, పోరాట పంథా గురించి వివరించడం వంటివి పవన్ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేయవచ్చు. పవన్ బస చేసే హోటల్ నుంచి సభా ప్రాంగణం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.ఏర్పాట్లను పరిశీలిస్తే.. సభ జరిగే ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు గాను మొత్తం నాలుగు రహదారులు ఏర్పాటు చేయగా.. ఒక రహదారిని పూర్తిగా వీఐపీలకే కేటాయించారు. మిగతా గేట్లు, రహదారులు అభిమానుల కోసం కేటాయించారు. సభ తర్వాత వెంటనే ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకునేందుకు కూడా ఓ గేటు ఏర్పాటు చేశారు.