టీటీడీ ఈవో ఇష్యూ: ‘‘జనసేన వ్యతిరేకమేమీ కాదు.. ఇదే విధానం అక్కడా అనుసరించాలి మరి..’’
టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారిని నియమించడాన్ని తాము వ్యతిరేకించలేదని, ఇదే విధానాన్ని ఉత్తర భారతంలో కూడా అనుసరించాలని మాత్రమే కోరుతున్నట్లు జనసేన స్పష్టం చేసింది.
హైదరాబాద్: టీటీడీ బోర్డు కార్యనిర్వహణాధికారిగా ఉత్తరాది ఐఏఎస్ అధికారిని నియమించడాన్ని తాము వ్యతిరేకించలేదు అని జనసేన ప్రకటించింది. ఇదే విధానాన్ని ఉత్తర భారతంలో కూడా అనుసరించాలని మాత్రమే జనసేన కోరుతోందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేంద్ర రెడ్డి అన్నారు.
ఈ మేరకు పార్టీ తరఫున, ఆయన పేరిట ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ సమగ్రత విషయంలో జనసేన నిబద్ధత ఎవరూ ప్రశ్నించలేనిది అని, దేశ సమగ్రతే జనసేన విధానం అని స్పష్టం చేశారు.
అమరనాథ్, మధుర, వారణాసి వంటి క్షేత్రాలకు కూడా పాలకులుగా దక్షిణాది రాష్ట్రాల వారిని నియమించాలన్న విజ్ఞప్తిని మీరు తప్పని ఎలా అంటారని జనసేన ప్రశ్నిస్తోందన్నారు. రెండు రోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లో భావం కూడా ఇదేనని గమనించాలన్నారు.
ఈ ట్వీట్ పై పలువురు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆ ట్వీట్లోని పరమార్ధాన్ని గ్రహించాలని సూచించారు. తమ అధ్యక్షుడి దేశ భక్తిని ప్రశ్నించే వారి నేతి బీర దేశభక్తి గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.
విమర్శలు మాని దక్షిణాది వారికి ఉత్తరాదిలో సమాన అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని జనసేన కోరుతోందన్నారు. కాగా, పవన్ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం విమర్శలు చేసిన నేపథ్యంలో జనసేన ఈ ప్రకటన విడుదల చేసింది.