జనసేనలో ఆయనకు కీలక పదవి..అయినా గుడ్ బై చెప్పేసారు: అధినేత పైన అసంతృప్తితోనే ..!
జనసేనకు మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ నుండి పార్లమెంట్ బరిలో నిలబడి ఓడినా..ఆయనకు పార్టీ అధినేత కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే..కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల..నైరాశ్యం పట్ల ఆయన అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఆయన జనసేనకు రాజీనామా చేస్తూ అధినేత పవన కు లేఖ రాసారు. ఐఆర్ యస్ అధికారికి అయిన చింత పార్ధసారధి జనసేనకు రాజీనామా చేసారు.
ఆయన జనసేనలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. పార్టీలో చేరిన సమయం నుండి అధినేత పవన్ కు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ నిర్మాణం.. సమన్వయకర్తల సారధ్యం వంటి బాధ్యతలు ఆయన నిర్వహించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుండి జనసేన లోక్ సభ అభ్యర్దిగా పోటీ చేసారు. అయితే..ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాలక దూరంగా ఉంటున్నారు.
ఫలితాల తరువాత పార్టీ అధనేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న చింతల పార్ద సారధి పార్టీకి రాజీనామా చేసారు. అయితే..ఆయన రాజీనామాకు పవన్ కళ్యాణ్ పైన అసంతృప్తి కారణమనే ప్రచారం జరుగుతోంది.

జనసేనలో ఏం జరుగుతోంది..
ఇప్పటికే జనసేనలో బలంగా పార్టీ వాయిస్ వినిపించే వారి సంఖ్య తగ్గిపోతోంది. అధినేత పవన్.. సోదరుడు నాగబాబు..నాదెండ్ల మనోహర్..ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మినహా అవసరమైన సందర్భాల్లో పార్టీ గళం విప్పే వారు కరువయ్యారు. ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలన మీద పవన్ కళ్యాణ్ నివేదిక విడుదల చేసారు. ఆ సమయంలో ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేసారు. దీనికి స్పందనగా వైసీపీ నేతలు ..మంత్రులు వరుసగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. జనసేన నుండి ఒక్క నేత కూడా వారి విమర్శల పైన స్పందించలేదు.
ఇక, రాష్ట్రంలో పాలనా వైఫల్యాల మీద పవన్ తన ట్వీట్ల ద్వారా మినహా నేరుగా విమర్శించే నేతలు ఇప్పుడు జనసేనలో కరువయ్యారు. అధికార ప్రతినిధులు స్పందించటం లేదు. ఎన్నికల తరువాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలోనే కొనసాగుతున్న పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇక, నాగబాబు..ఎమ్మెల్యే వర ప్రసాద్ అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. మరో కీలక నేత నాదెండ్ల మనోమర్ అధినేత పవన్ తో పాటుగా ఉంటూ చర్చలు.. సమావేశాల్లోనే పవన్ వాయిస్..ఆయన అభిప్రాయాలను వినిపిస్తున్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీగా.. రాజకీయ పక్షంగా మాత్రం జనసేన నుండి బలమైన అభిప్రాయాలు వినిపించటం లేదు. ఇప్పుడు, ఇలా కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఏకంగా అధినేత మీద అసంతృప్తితోనే పార్టీ వీడుతున్నారనే అభిప్రాయం కేడర్ మీద ప్రభావం చూపుతోందనే అందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications