ఎగ్జిట్ పోల్స్ పై జనసేన నేత మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏమన్నారంటే
ఏపీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు అంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జనసేనను జీరోగా చూపించాయన్న విషయం అందరికీ తెలుసు . లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం జనసేన ఒకటి నుండి రెండు స్థానాలు గెలుస్తుంది అని చెప్పింది. ఏడోదశ ఎన్నికలు ముగిసిన వెంటనే పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో జనసేన ప్రభావం ఏపీలో ఏ మాత్రం లేనట్టు చూపించాయి. దీంతో జనసైనికుల్లో ఎక్కడ లేని నిరుత్సాహం అలముకుంది.
ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
ఇక జనసైన్యంలో నిరాశా నిస్పృహలను పోగొట్టటానికి జనసేన పార్టీ నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్స్ ను తాను పట్టించుకోనని , ఎవరూ పట్టించుకోవద్దని ఆయన జనసైనికులను కోరారు. ఇక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంశాల నేపధ్యంలో మొదటి సారి స్పందించిన జనసేన నేత, విశాఖ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాము నిత్యం ప్రజా సేవలో ఉంటామని తెలిపారు. తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23 వరకూ ఫలితాల కోసం ఎదురుచూడాలని జనసేన కార్యకర్తలు, అభిమానులను కోరారు.
ఎగ్జిట్ పోల్స్ తో మీడియా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందన్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
విశాఖపట్నంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో అనవసరంగా ఉత్కంఠను కలిగిస్తున్నారని విమర్శించారు. లేని పోని కన్ఫ్యూజన్ ను కలిగిస్తున్నాయని చెప్పారు. గెలుపు, ఓటములతో తమకు సంబంధం లేదన్నారు. ఓడినా, గెలిచినా... ప్రజల కోసం పొరాడేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం తమపై ఎప్పుడూ ఉండదని చెప్పారు. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నాం అని మరో మారు స్పష్టం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ పై పవర్ స్టార్ సైలెంట్ ...ఎగ్జిట్ పోల్స్ పై పవన్ స్పందన ఏంటో
ఇక తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై అన్ని పార్టీలు తమదైన స్పందన తెలియజేస్తున్నాయి. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దు అని సూచిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ పై ఎవరికి వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాతీయ సర్వేల్లో జనసేన ఊసే లేకపోవడం శ్రేణుల్లో నిరాశాజనకంగా మారింది. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. జనసేన నేత వీవీ లక్ష్మీ నారాయణ తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తో ఏ మాత్రం ఏకీభవించటం లేదని పార్టీ పట్టించుకోదని చెప్పి జనసేన స్టాండ్ తెలియజేశారు . ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఎగ్జాక్ట్ పోల్స్ చూసాక స్పందిస్తామంటున్న జనసేన పార్టీ ఏపీలో ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందో మరి.