పిఠాపురంపైనే ఫోకస్- అక్కడ గెలిస్తే చాలా..?!
Nagababu: ఏపీలో ఓట్ల లెక్కింపు గడువు దగ్గరికొచ్చింది. ఎంతో సమయం లేదు. ఎల్లుండే కౌంటింగ్. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తోన్నారు. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్పై మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

ఓట్ల లెక్కింపు కోసం అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. దీనిపై కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేకంగా వర్క్షాప్ను సైతం నిర్వహించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు వివిధ లోక్సభ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ వర్క్షాప్ ముగిసింది.
అదే సమయంలో జనసేన కూడా తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లకు కొన్ని సూచనలను ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్టీ ఏజెంట్లు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కారకులు కావొద్దని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు పార్టీ నాయకుడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోబోతోన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కవ్వింపు చర్యలకు రెచ్చిపోవద్దని, సంయమనాన్ని పాటించాలని కోరారు. ప్రత్యేకించి- పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కౌంటింగ్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
కౌంటింగ్ ప్రక్రియలో కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2024
- శ్రీ నాగబాబు గారు pic.twitter.com/hDQpp1ZGjp
తమ పార్టీ నాయకులను రెచ్చగొట్టేలా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని నాగబాబు ఆరోపించారు. వైసీపీ ఓటమి ఖాయమైందని, విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఆ పార్టీపై ఉన్న ప్రజాగ్రహానికి అద్దం పట్టిందని చెప్పారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు దిగడం వల్ల కార్యకర్తలు, వాళ్ల కుటుంబాలు ఇబ్బందులు పడతాయని, రెచ్చగొట్టిన వాళ్లెవరూ ఆదుకోవడానికి ముందుకు రాబోరని నాగబాబు చెప్పారు. అన్ని పార్టీల కార్యకర్తలు ఒక కుటుంబంలా కలిసి మెలిసి, స్నేహపూరకంగా వ్యవహరించాలని, గొడవల జోలికి వెళ్లొద్దని అన్నారు.












Click it and Unblock the Notifications