రోజా ఇంటిముందు తొడగొట్టి సవాల్!
మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డుపై జనసేన నాయకులు తొడగొట్టారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ ఛార్జి కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాయల్ ను నగరి కోర్టులో హాజరు పరచగా వారికి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ పై విడుదల చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. బెయిల్ పై విడుదలైన తర్వాత జనసేన నాయకులు ర్యాలీ నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా ర్యాలీగా వెళ్లారు. మంత్రి రోజా ఇంటి దగ్గర ఆగి కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ తదితర నాయకులు తొడలు కొట్టారు.

ప్రధానమంత్రి మోడీతో భేటీ సమయంలోనే జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడాన్ని జనసేన నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి కిరణ్ ను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రి రోజా జబర్దస్త్ షో చేశారని, వారు ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారన్నారు. పవన్ ను కనీసం తాకే దమ్ము, ధైర్యం వైసీపీకి లేదని.. దమ్ముంటే ఒకసారి పవన్ కల్యాణ్ ను టచ్ చేసి చూడాలంటూ కిరణ్ సవాల్ విసిరారు. విశాఖలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందని, పనికిరాని మంత్రులంతా జనసేనానిపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. రోజా తమిళనాడులో వివాహం చేసుకున్నారని, అక్కడ రాజధాని పెట్టుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపైనే కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications