Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా-పవన్ కళ్యాణ్ తో భేటీ..!
జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇవాళ తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. అయితే ఇందులో ఏం తేలిందో తెలియదు కానీ ఇవాళ ఉన్నట్లుండి అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారని, తన శాసన సభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని అందజేశారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారని జనసేన వర్గాలు వెల్లడించాయి. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన వివరణ ఇచ్చారని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి.

అరవ శ్రీధర్ పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం జరిగాయి. ఆ తర్వాత త్రిసభ్య కమిటీని కూడా నియమించిన పవన్ కళ్యాణ్.. విచారణ ఎదుర్కోవాలని సూచించారు. దీంతో విచారణకు వెళ్లిన అరవ శ్రీధర్ ఈ వివాదంతో తనకు సంబంధం లేదని చెప్పేశారు. అయితే ఆయన బాధితురాలు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనతో రాజీనామా చేయించారా లేక ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మాత్రం అరవ శ్రీధర్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారని మాత్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications