అమరావతిలో పవన్ - శ్రీకాకుళంలో నాగబాబు : టార్గెట్ వైసీపీ - టీడీపీ ఫోకస్..!!
జనసేన గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ సారి ఎన్నికల కోసం ముందుగానే కసరత్తు ప్రారంభించింది. ఒక వైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని రాజకీయంగా కొత్త చర్చకు కారణమైన పవన్ ఇప్పుడు పార్టీ కీలక సమావేశానికి సిద్దమయ్యారు. నెల 4న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు అంశాలపై చర్చించనున్నారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు నిర్ణయించారు.
పొత్తులపైన మూడ్ తెలుసుకుంటూ
అమరావతి పరిధిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇక, మెగా బ్రదర్ నాగబాబు అటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. వైసీపీ టార్గెట్ గా ఆయన ప్రసంగాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో పొత్తుల పైన పార్టీ మూడ్ తెలుసుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ఈ పరిస్థితులలో జనసేన లాంటి పార్టీ అధికారంలోకి రావలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని నాగబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలలో జనసేన కార్యకర్తలు, నాయకులలొ ఏమైనా అభిప్రాయ బేధాలుంటే వాటిని పక్కకు పెట్టి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
టార్గెట్ వైసీపీ.. బీజేపీతో బంధంపైనా
ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని నాగబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం బాగుండటమే కాకుండా భవిష్యత్ తరాల ప్రయోజనాలకోసం కూడా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్న ఆశతో ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో నియోజకవర్గ ఇన్చార్జ్లు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పొత్తులపైన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు. అయితే, జనసేన యాక్టివిటీ పైన టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకొని టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. జనసేన గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురావటం లేదు. అదే విధంగా టీడీపీ పైనా జనసేన ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఇప్పుడు బీజేపీతో ఉన్న బంధం పైనే జనసేన తేల్చుకోలేకపోతోందనే చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారే లక్ష్యంతో
బీజేపీతో కొనసాగాలా లేదా అనే దాని పైన తర్జన భర్జన పడుతోంది. అయితే, అటు కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం సీఎం జగన్ తో సన్నిహితంగా ఉండటం.. రాష్ట్రం లో తమతో మిత్రపక్షంగా ఉండటం పైన జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ -జనసేన కలిసి పోటీ చేయాలనేది కొందరు జనసేన నేతల అభిప్రాయం. అయితే, అందుకు బీజేపీ సహకరిస్తుందా లేదా అనేది సందేహమే. ఈ పరిస్థితుల్లో పార్టీలో మెజార్టీ అభిప్రాయం మేరకు ముందుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 4న జరిగే పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయం పైన మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.