పవన్ కల్యాణ్ తో మాట్లాడితే ఇళ్ల పట్టాలు రద్దు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో మాట్లాడితే ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు ఆరోపించారు. జాబితాలు పట్టుకొని లబ్ధిదారుల వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారని వెల్లడించారు. విజయనగరం మండలం గుంకలాంలో పవన్ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గుంకలాం లేఅవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారని, ఇందులోను అవినీతి జరిగిందని వెల్లడించారు. ఎకరా భూమి రూ.10 లక్షలు ఉంటే రూ.70 లక్షలకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని తాతారావు తెలిపారు. 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు ఒక్క ఇంటినీ నిర్మించలేదని, ఇసుక, సిమెంటు మాత్రమే ఇచ్చారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి ప్రజలపై ప్రేమ ఉంటే ఇళ్లు అందించాలని ఆయన డిమాండు చేశారు.
పవన్ కల్యాణ్ పర్యటనపై గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసు వ్యవస్థలపై తమకు గౌరవం, నమ్మకం ఉన్నాయన్నారు. జనసేన స్టేట్ ప్రోగ్రామింగ్ కమిటీ ఛైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి పాలవలస యశస్వి, పలువురు నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పవన్ పర్యటన విజయవంతమవడానికి ఏం చేయాలనేదానిపై సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.