సినిమా ముందుంది కదా.. ట్రైలర్ ఎందుకు?, ఆరోజే అన్నీ: పవన్
అమరావతి: మార్చి 14తో జనసేన పార్టీకి ఐదేళ్లు నిండబోతున్నాయి. ఈ ఐదేళ్లలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ఆ పార్టీ.. ఇప్పుడిప్పుడే క్రియాశీలక రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తొలిసారి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు.
Recommended Video
బీజేపీ, టీడీపీ, వైసీపీలపై జనసేనాని వైఖరేంటి? ఆవిర్భావ సభలో ఏం చెప్పబోతున్నారు?
తాజాగా రాజధాని ప్రాంతం కాజ సమీపంలోని టోల్గేట్ వద్ద నూతన ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన పవన్.. భవిష్యత్తులో పార్టీ కార్యాలయాన్ని కూడా ఇక్కడే నిర్మించే అవకాశాలున్నాయి. ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
పార్టీ విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఇప్పుడైతే ఇంటి శంకుస్థాపన గురించి మాట్లాడుతా. మార్చి 14 తర్వాత జనసేన కార్యాచరణపై పూర్తి స్పష్టత ఇస్తా. అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తా.
ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందా?
చాలా రోజుల నుంచి దీనిపై నేను మాట్లాడుతున్నా. ఆ క్రమంలో నేనెవరిని వెనుకేసుకురావట్లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరితోనూ ఏ శత్రుత్వాలు లేవు. సాధ్యమైనంత వరకు సయోధ్యతోనే ముందుకెళ్తా. ప్రజా సమస్యలను పట్టించుకోని పక్షంలో మాత్రం నా స్పందన బలంగా ఉంటుంది.
సినిమా ముందుంది?..:
మార్చి 14న దీనిపై మాట్లాడాలనుకుంటున్నా. ఏం చెప్పబోతున్నానో నాకు స్పష్టత ఉంది. మనసులో అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. సమస్య నుంచి పారిపోయే తత్వం కాదు.
ఆవిర్భావ సభలోనే వీటిపై మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకా ఒకరోజే కాబట్టి మీరూ ఓపిక పట్టాలి. ఇప్పటికే దీనిపై చాలా ట్రైలర్లు వదిలాను. అయినా మొత్తం సినిమా ముక్కలు ముక్కలుగా ట్రైలర్లో చూసేస్తే ఏం బాగుంటుంది.(నవ్వుతూ..)
జనసేనకు ఒక మూస పార్టీ లాగే వెళ్తోంది?
ఒక పదో తరగతి విద్యార్థికి ఇంకో పదో తరగతి విద్యార్థి పాఠం చెప్పగలడా?.. కచ్చితంగా ఉపాధ్యాయులే చెప్పాలి. వేలల్లో టీచర్లు ఉన్నారు. అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడను. అస్సాం గణపరిషత్ విద్యార్థులతో నడిపించారు. ఉవ్వెత్తున లేచినా.. ఆ తర్వాత అది చల్లారిపోయిది. యువత తాలుకు ఉడుకు నెత్తురు, పెద్దవాళ్ల సంయమనం, అనుభవం అన్నీ కావాలి పార్టీకి.
పార్టీలో చేరికలపై:
నాతో పాటు చాలా మంది కొత్తవారు ఉన్నారు. అయితే అయితే ఆ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి వచ్చేయాలని నేనెవరికీ కబురు పెట్టను.
ఆస్తులపై..:
నా ఆస్తులన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. అది ప్రజలు ప్రేమతో ఇచ్చింది. రెండు దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్నా. ఒకసారి అన్నీ పోగొట్టుకున్నా. మళ్లీ సంపాదించుకున్నా. అయినా ఆస్తులు వెల్లడించడానికి నాకే భయాలు లేవు. సమయం సందర్భం వస్తే తప్పకుండా వెల్లడిస్తా.
పార్టీ నిర్మాణంపై:
దాదాపు 40వేల మంది ఆలోచనా పరుల్ని పార్టీలోకి తీసుకున్నాం. ప్రతీ జిల్లా నుంచి కొంతమందిని ఎంపిక చేసి.. 12మంది సభ్యులతో కూడిన స్పీకర్ప్యానెల్ కూడా సిద్ధం చేశాం.
మా నాన్న సీఎం కాదు, మిగిలినవాళ్లలా నేను అన్ని ఏర్పాట్లు త్వరగా చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతీసారి శల్య పరీక్షకు గురిచేసే ప్రశ్నలను తట్టుకుని ప్రజల నమ్మకంతో ముందుకెళ్లడం కష్ట సాధ్యం. దానికి కావాల్సిన ఓపిక, సహనం నాకున్నాయి.