'స్థానికం' లో జనసేన కోరే స్థానాలివే..? కీలక మంత్రాంగం..!!
ఏపీలో స్థానిక ఎన్నికల కోసం రంగం సిద్దం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మక పోరుగా భావిస్తున్నారు. 2024 ఎన్నికల తరహాలో ఏకపక్షంగా విజయం సాధించి.. 26 నెలల పాలనకు ప్రజా మద్దతుగా నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. అటు వైసీపీ సైతం ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. ఈ సమయంలోనే జనసేన ఈ సారి తమకు సీట్ల సంఖ్య విషయం లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పోటీ స్థానాల పైనా కసరత్తు చేస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తమకు బలం ఉన్న చోట పోటీకి అవకాశం ఇవ్వాలని జనసేన కోరుతోంది. ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. మేయర్ సీట్లు కనీసంగా అయిదు నుంచి ఆరు దాకా అలాగే జెడ్పీ చైర్మన్లు 9 దాకా, మున్సిపల్ చైర్మన్లు 25 దాకా తీసుకోవాలని జనసేనలో ముఖ్య నేతలు భావిస్తున్నారు. పవన్ ఈ నెల 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే నియమించిన కమిటీలు పార్టీకి ప్రతిపాదనలు ఇవ్వనున్నారు.

పార్టీలో చర్చించిన తరువాత ఇక కూటమి పార్టీల అధినేతల భేటీ సమయంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ముప్పయి శాతం ఫార్ములాతో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జనసేన నేతలు 2024 ఎన్నికల నాటి ఫార్ములా మేరకు సీట్ల కేటాయింపు స్థానిక ఎన్నికల్లో ఉండదని... జనసైనికుల ఆత్మగౌరవం నిలబడేలా పోటీ ఉంటుందని స్పష్టం చేసారు. కాగా, అదే సమయంలో కూటమికి నష్టం లేకుండా పోటీ చేయాలని భావిస్తున్నారు.
మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్.. పోటీ స్థానాల పైన స్పష్టత కోసం తొలుత సమన్వయ కమిటీ సమావేశం కానుంది. అయితే, జనసేన ఇప్పటికే చేసిన ప్రాధమిక కసరత్తులో తాము పోటీ చేయాలని భావిస్తున్న స్థానా పైన ఒక జాబితా తో సిద్దం అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16 కార్పోరేషన్లు ఉండగా.. అందులో ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి అడగాలని భావిస్తోంది. అయితే, విజయవాడ కోసం ఇప్పటికే డిమాండ్ మొదలైంది. టీడీపీ మచిలీపట్నం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. తిరుపతి లేదా విశాఖలో ఒకటి ఇవ్వాలని కోరేందుకు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇక.. మున్సిపాల్టీల్లో భీమవరం , పిఠాపురం, తాడేపల్లి డెం, తెనాలి, చీరాల, తణుకు, అమలాపురం, నరసాపురం, అనకాపల్లి, మండపేట, నిడదవోలు, పెద్దాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, సత్తెనపల్లి, తుని, గొల్లప్రోలు, కొవ్వూరు, నగరి, పెడన, పుత్తూరు, తాడిగడప, వుయ్యూరు, యలమంచిలి, జంగారెడ్డిగూడెం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయితీల్లో పంపకాల వేళ ఖరారు చేసే నిష్పత్తి ఆధారంగా పంచాయితీలు ఖరారు కానున్నాయి. దీంతో.. ఎన్నికల్లో ఎవరికి ఏ సీట్లు దక్కుతాయనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.














Click it and Unblock the Notifications
