టీడీపీ కంచుకోటను అడుగుతున్న జనసేన.. డైలమాలో చంద్రబాబు?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం దాదాపుగా ఖాయమైనట్లు భావించవచ్చు. తన స్వభావానికి విరుద్ధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటినుంచే ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఆరునెలల క్రితమే కొందరి పేర్లు ఖరారు చేశారు. వాస్తవానికి నామినేషన్ వేసే చివరి రోజువరకు చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ప్రకటించరని, దీనివల్ల నష్టపోతూ వస్తున్నామని కార్యకర్తలు ఆవేదన చెందుతుంటారు. దీనికి భిన్నంగా చంద్రబాబు అభ్యర్థుల ప్రకటనలో కూడా దూకుడు చూపిస్తున్నారు.
జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని నియోజకవర్గాలు కేటాయించాలి? రాష్ట్రం మొత్తంమీద ఎన్ని స్థానాలు కేటాయించాలనే విషయంపై చంద్రబాబు ఒక స్పష్టతకు రావాల్సి ఉంటుంది. జనసేన మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటుకూడా రానివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు.

తమకు బలం ఉన్నచోటే సీట్లు అడిగి తీసుకోవాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఇందులో భాగంగా భీమిలీ నియోజకవర్గంపై ఆ పార్టీ పెద్ద కసరత్తు చేసింది. అభిమానుల బలం బలంగా ఉండటంతో టీడీపీ పొత్తుతో ఈ నియోజకవర్గాన్ని సులువుగా గెలుచుకోగలమని పవన్ భావిస్తున్నట్లున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున భీమిలీ నుంచి పంచకర్ల సందీప్ పోటీచేసి 25వేలకు పైగా ఓట్లను పొందారు. అంతకన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీతో ఈసారి గెలుపు ఖాయమనే లెక్కల్లో జనసేన ఉంది.
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో పాగా వేయగలిగింది. 2009, 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న భీమిలీని జనసేన అడుగుతుండటంతో చంద్రబాబు ఏం చేస్తారో ననే ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.












Click it and Unblock the Notifications