రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు: పవన్ కళ్యాణ్ పిలుపు అంటూ నాదెండ్ల మనోహర్
అమరావతి: రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని అమరావతిని ఉద్దేశిస్తూ జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధాని రైతుల మహా పాదయాత్ర-2కు జనసేన మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ పిలుపు అంటూ నాదెండ్ల మనోహర్
రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని జగన్ సర్కారుకు చురకలంటించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతులు ఎక్కడా సంతోషంగా లేరన్నారు. గతంలో తిరుమల పాదయాత్రకు మద్దతిచ్చామని.. ఇప్పుడు అరసవల్లి పాదయాత్రకు జనసేన కార్యకర్తలు అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. అమరావతి రైతులతో 10నిమిషాలు మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోయిందని మండిపడ్డారు. రైతులకు భయపడి రాజధాని ప్రాంతాల్లో పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక రాజధానే కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతారా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

సోమవారం నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర
కాగా, సోమవారం గుంటూరు జిల్లా వెంకటపాలెంలో మొదలు కానుంది అమరావతి మహాపాదయాత్ర. సరిగ్గా రెండు నెలల తర్వాత నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగియనుంది. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిపై జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరించడంతోపాటుగా.. పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తామని చెబుతున్నారు రాజధాని అమరావతి రైతులు.

రైతులకు నారా లోకేష్ సంఘీభావం
12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగే యాత్ర.. మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ సాగనుంది. సోమవారం వెంకటపాలెంలో మొదలయ్యే యాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. కృష్ణాయపాలెం వద్ద యాత్రలో పాల్గొనున్న తెలుగుదేశం నేత నారా లోకేశ్.. రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ఏపీకి ఒకే ఒక రాజధాని అమరావతి ఉండాలని రైతులు సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications